‘టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారు’

ఏపీ ప్రభుత్వంపై, వైసీపీ అధినేత, సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిడెడ్ పాఠశాలల విలీనం వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఆ విషయంలో బడికి వెళ్లే విద్యార్థులు కూడా జగన్ పై గుర్రుగా ఉన్నారని రఘురామ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ నేత పట్టాభిపై దాడి విషయంలో రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారని రఘురామ ఆరోపణలు చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, పట్టాభిని కొట్టారో లేదో వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టాభిని పోలీసులు కొట్టారనేందుకు తన దగ్గర ఆధారాలున్నాయని రఘురామ ధీమాగా చెప్పడం చర్చనీయాంశమైంది. పట్టాభిని అరెస్టు చేసిన తర్వాత ఆయనను కోర్టు నుంచి మచిలీపట్నం జైలుకు తీసుకువెళుతున్నారని, ఆ సమయంలో ఆయనపై దాడి జరిగిందని వెల్లడించారు.

అయితే, తనకు పోలీసులంటే గౌరవమని, కానీ, కొందరు పోలీసుల వల్ల పోలీసులందరికీ చెడ్డపేరు వస్తోందని అన్నారు. కస్టడీలోని వ్యక్తిపై దాడిని పోలీసులు ఖండిస్తారని అభిప్రాయపడ్డారు. పోలీసులు అడిగితే పట్టాభిపై దాడి వివరాలు ఇస్తానని అన్నారు. జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే వైసీపీ నేతలు, పోలీసులు చదువుతున్నారని రఘురామ ఆరోపించారు. త్వరలోనే కొందరు అధికారుల గుట్టును సాక్ష్యాధారాలతో సహా రట్టు చేస్తానని అన్నారు.
ఐఏఎస్ అధికారులు స్వతంత్రగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోలేకపోవడం వల్లే బయటి రాష్ట్రాల్లో వారిని పట్టుకుంటున్నారని అన్నారు.

కాగా, పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఆల్రెడీ పట్టాభికి హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, కస్టడీకి కోరడం సరికాదని పట్టాభి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పట్టాభి చేసిన వ్యాఖ్యల వెనకున్నది ఎవరో తెలుసుకోవాల్సిన అవసరముందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు… పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.