మోడీపై ఒక‌టి కాదు.. రెండు కాదు.. 19 పార్టీల వ్య‌తిరేక‌త‌..!

Modi
Modi

ఒక‌టి కాదు..రెండు కాదు.. ఏకంగా 19 పార్టీలు.. ప్ర‌ధాని మోడీపై నిప్పులు చెరిగాయి. “మేం వ‌చ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్ర‌జాస్వామ్యం మీ మూతి మీద మీస‌మా.. అలానే తిప్పుకోండి!” అంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేశాయి. దీనికికార‌ణం.. పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించడానికి రెడీ కావ‌డ‌మే.

దాదాపు 200 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ఢిల్లీలో ‘సెంట్ర‌ల్ విస్టా’ పేరుతో కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో తొలి ద‌శ ప్ర‌ధాన నిర్మాణాన్ని మోడీ చేతుల మీదుగా ఈ నెల 28న ప్రారంభించ‌నున్నారు. అయితే.. రాజ్యాంగ వేదిక అయిన‌.. పార్ల‌మెంటును రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ క‌ర్త అయిన‌.. రాష్ట్ర‌ప‌తి ప్రారంభించాలి కానీ.. ఇలా ప్ర‌ధాని ప్రారంభించ‌డం ఏంట‌నేది.. విపక్ష నాయ‌కుల విమ‌ర్శ‌.

ఈ క్ర‌మంలోనే అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌నల అనంత‌రం.. కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, శివసేన(యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్‌(మణి), వీసీకే(విడుత‌లై చిరుతైగ‌ల్ క‌ట్చి), ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే వంటి 19 పార్టీలు ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఆయా పార్టీల‌కు ఇప్ప‌టికే పార్ల‌మెంటు స్పీక‌ర్ నుంచి ఆహ్వానాలు అందిన విష‌యం తెలిసిందే.

‘పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోడీకి కొత్తేం కాదు. పార్లమెంట్‌లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తి నప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. పార్లమెంట్‌ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టినప్పుడు.. ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు’ అని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.