తేజుకు యాక్సిడెంట్ వల్ల జరిగిన మంచి

టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురి కావడం.. దాదాపు నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండటం తెలిసిందే. వినాయక చవితి పర్వదినాన జరిగిన ఆ ప్రమాదం టాలీవుడ్‌కు పెద్ద షాకే. తేజుకు ప్రాణాపాయం తప్పింది కానీ.. అతడికి తగిలిన గాయాలు చిన్నవేమీ కాదనడానికి రుజువు.. అతను నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండటం.

తన సినిమా ‘రిపబ్లిక్’ ప్రమోషన్లలో అతను పాల్గొనడానికే వీల్లేకపోయింది. రిలీజ్ తర్వాత కూడా ఆడియో, వీడియో బైట్లు ఇవ్వలేకపోయాడు. తేజును కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలుస్తున్నా కూడా అతడి ఫొటోలేవీ బయటికి రావడం లేదు.

గాయాలతో, లేదా మరీ వీక్‌గా కనిపిస్తున్న దశలో ఫొటోలు బయటికి వస్తే అవి జనాలకు అలా గుర్తుండిపోతాయని.. అందుకే పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యే వరకు తేజు ఫొటోలు, వీడియోలేవీ బయటికి రాకుండా చూస్తున్నారని తెలుస్తోంది.

ఐతే తేజును కలిసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం అతను మునుపటితో పోలిస్తే సన్నగా కనిపిస్తున్నాడట. యాక్సిడెంట్ వల్ల తేజుకు జరిగిన మంచి ఇదే అని అంటున్నారు. ‘రిపబ్లిక్’ సినిమాలో.. అంతకుముందు సోలో బ్రతుకే సో బెటర్, ప్రతి రోజూ పండగే చిత్రాల్లో తేజును చూసిన చాలామంది అతడి ఫిజిక్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

అతను లావుగా కనిపిస్తున్నాడని.. సన్నబడాలని సూచించారు. కానీ తేజు తగ్గలేకపోయాడు. ఐతే ప్రమాదం తర్వాత కొన్ని రోజులు తేజు స్పృహలో లేకపోవడం, ఘన పదార్థాలేవీ తీసుకోకపోవడంతో అతను బలహీన పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గణనీయంగానే బరువు తగ్గినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే తేజు కెరీర్ ఆరంభంలో మాదిరి సన్నగా తయారయ్యాడని.. కాకపోతే వీక్‌గా కనిపిస్తున్న నేపథ్యంలో కొంచెం బలవర్ధకమైన ఆహారం తీసుకుని, వర్కవుట్లు చేస్తే దృఢంగా తయారై మంచి లుక్‌లోకి రాగలడని అంటున్నారు.