కేసీఆర్ ముందుచూపును మెచ్చుకోవాల్సిందే

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ఇరవైఏళ్ల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో.. భారీ ఎత్తున నిర్వహించిన ఒక రోజు ప్లీనరీని ఎంత ఘనంగా నిర్వహించారో తెలిసిందే. అంగరంగ వైభవంగా నిర్వహించిన పార్టీ ప్లీనరీ పుణ్యమా అని.. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రహదారులు మొత్తం గులాబీ మయం కావటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినా పాలక పక్షం కానీ.. అధికారులు కానీ పెద్దగా పట్టించుకోకపోవటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్లీనరీ సందర్భంగా చోటు చేసుకున్న ఒక కీలక మార్పు మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పార్టీకి సంబంధించిన ఈ కీలకమైన మార్పును చూస్తే.. రాబోయే రోజుల్లో ఏదైనా అనుకోనిది జరిగితే.. ఎలాంటి ఇబ్బంది కలుగకకుండా ముందస్తు జాగ్రత్తల్లోనే భాగంగా తాజా రూల్ ఉండటం గమనార్హం. తన రాజకీయ వారసత్వాన్ని కొడుకు కేటీఆర్ కు అప్పజెప్పాలన్న విషయం మీద కేసీఆర్ చాలా క్లారిటీతో ఉన్న విషయం తెలిసిందే.

కేటీఆర్ కు పగ్గాలు అప్పజెప్పే విషయంలో గులాబీ బాస్ కు ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ.. పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు అంతర్గతంగా ఉన్నాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదే.. ఆయన్ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుందని కూడా చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. ప్లీనరీ వేళ పార్టీకి సంబంధించిన ఒక ప్రధానమైన రూల్ ను తాజాగా మార్చేశారు.

తాజాగా మార్చిన నిబంధన ప్రకారం.. పార్టీ అధ్యక్షుడు అబ్సెన్స్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు అధికారాలు ఆటోమేటిక్ గా సంక్రమించేలా టీఆర్ఎస్ నియమావళిలో మార్పు చేశారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్లీనరీలో ఆమోద ముద్ర కూడా వేశారు. అంతేకాదు.. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్ గా పార్టీ అధ్యక్షుడిగా మారటంతో పాటు.. తనకు నచ్చిన వారిని రాష్ట్ర కార్యవర్గంగా ఎంపిక చేసుకునే వీలుందన్న విషయాన్ని ఇందులో పేర్కొనటం గమనార్హం.

అంతేకాదు.. జిల్లా.. నియోజకవర్గ స్థాయి కార్యవర్గాల్ని నియమించే అధికారం రాష్ట్ర అధ్యక్షుడికి సంక్రమించాలన్న మరో తీర్మానానికి సైతం తాజాగా ఓకే చేశారు. ఇదంతా చూస్తుంటే.. భవిష్తత్తు అవసరాలకు సిద్ధంగా ముందస్తుగానే ప్లానింగ్ లో ఉన్న విషయం తాజా మార్పుల్ని నిశితంగా చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.