భూమ‌న‌.. పెద్ద‌ల స‌భ‌కేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కావాల్సినంత స‌స్పెన్స్ ఉంది. థ్రిల్ల‌ర్ సినిమాను మించి ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు సాగుతున్నాయి. అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు ఇలా ప‌రిణామాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఆ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. ఇప్పుడు వైసీపీ పార్టీలో ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌పై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అందులో ఒక‌టి.. కొత్త మంత్రివ‌ర్గంలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంద‌నేది కాగా.. మ‌రొక‌టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఎవ‌రికి టికెట్లు ఇస్తుందోన‌నేది. 2023 ఎన్నిక‌ల్లో టికెట్లు ద‌క్కే అవ‌కాశాలు లేని వాళ్లు ఎవ‌రంటూ చ‌ర్చ సాగుతోంది. అందులో భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి పేరు వినిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున తిరుప‌తి ఎమ్మెల్యేగా గెలిచిన భూమా క‌రుణాక‌ర్‌రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొండి చెయ్యే ఎదుర‌వ్వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ సారి ఆయ‌న్ని ప‌క్క‌న‌పెట్టే అవ‌కాశాలు స్ప‌ష్టం క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇవే త‌న చివ‌రి ఎన్నిక‌ల‌ని ఆయ‌న చెప్పిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌న సీటుకు ఎస‌రు పెట్టేలా క‌నిపిస్తున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న వారసుడిని ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు. కానీ అందుకు జ‌గ‌న్ ఒప్పుకోలేద‌ని స‌మాచారం. తిరుప‌తిలోని సామాజిక వ‌ర్గాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ పార్టీలు కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల పేరుతో ఎన్నిక‌ల‌కు వెళ్తాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో తిరుప‌తిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌నే బ‌రిలో దించేందుకు జ‌గ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే భూమ‌న‌కు జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. తిరుప‌తిలో బ‌లిజ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. అక్కడ నాయ‌కుల గెలుపోట‌ములు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి, చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి, వెంక‌ట‌ర‌మ‌ణ‌, సుగుణ వీరంతా అక్క‌డి నుంచి గెలిచిన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లే. అయితే ఎన్టీ రామారావు, భూమ‌న కూడా అక్క‌డ గెలిచారు.

కానీ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిపై భూమ‌న కేవ‌లం 700 ఓట్ల తేడాతో మాత్ర‌మే గెలిచారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ముందే జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్‌.. ఆ నియోజ‌వ‌క‌వ‌ర్గంలో భూమ‌న‌ను కాద‌ని కాపు సామాజిక వ‌ర్గం నేత‌నే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టే ఆస్కార‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు. టికెట్ ఇవ్వ‌ని భూమ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి పెద్ద‌ల స‌భ‌కు పంపాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.