అన్న కోసం క‌ష్ట‌ప‌డుతున్న చెల్లి

త‌న అన్న‌కు ఢిల్లీ పీఠాన్ని అందించేందుకు.. కేంద్రంలో గ‌ద్దెనెక్కించేందుకు ఆ చెల్లి తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో బ‌ల‌హీన ప‌డ్డ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు అవ‌స‌ర‌మైన అవ‌కాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకోవ‌డం కోసం ఆ చెల్లి అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇంత‌కీ ఆ చెల్లి ఎవ‌రంటే.. ప్రియాంక గాంధీ. ఆ అన్న మ‌రెవ‌రో కాదు రాహుల్ గాంధీ. వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం ప్రియాంక.. త‌న‌దైన శైలి వ్యూహాలు రచిస్తూ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు.

ఉత్త‌రప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. కానీ యోగీ ప్ర‌భుత్వంపై ఆ రాష్ట్రంలో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశ రాజ‌కీయాల్లో ఎంతో కీల‌మైన ఈ రాష్ట్రంలో ఈ సారి విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ ఉంది. ఆ కీల‌క‌మైన బాధ్య‌త‌ను ప్రియాంక మీద వేసింది. దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన యూపీలో పీఠం ద‌క్కించుకుంటే.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు అదెంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేప‌ట్టి.. రాహుల్ గాంధీని ప్ర‌ధాని కుర్చీలో కూర్చోబెట్టే దిశ‌గా మంచి అవ‌కాశం దొరుకుతుంద‌ని పార్టీ భావిస్తోంది.

అందుకే ఈ సారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ను ఆ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. గ‌తంలో లాగా తేలిగ్గా తీసుకోకుండా ఈ సారి విజ‌యం కోసం పోరాడ‌నుంది. గ‌తంలో రాజ్ బ‌బ్బ‌ర్ లాంటి వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాంతీయ పార్టీల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డింది. కానీ ఈ సారి ఒంట‌రిగానే బ‌రిలో దిగి ప‌ట్టు సాధించాల‌ని అనుకుంటోంది. ఇక్క‌డ విజ‌యం సాధించి త‌న అన్న‌ను ఢిల్లీ పీఠానికి ద‌గ్గ‌ర చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ప్రియాంక ఉన్నారు. అందుకు ఇప్ప‌టి నుంచే అడుగులు వేస్తున్నారు. త‌మ పార్టీ మేనిఫేస్టోను అంచెలంచెలుగా విడుదల చేస్తున్నారు.

ఇప్ప‌టికే యూపీలో ప్రియాంక ప్ర‌తిజ్ణ యాత్ర‌ల‌ను ప్రారంభించారు. ఈ యాత్ర‌ల ప్రారంభం సంద‌ర్భంగా ప్రియాంక పెద్ద ఎత్తున హామీలిచ్చారు. ప్ర‌ధానంగా రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడా హామీ రైతుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అలాగే ప‌న్నెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినుల‌కు స్మార్ట్‌ఫోన్లు డిగ్రీ విద్యార్థినుల‌కు స్కూటీలు ఉచితంగా ఇస్తామ‌న్నారు. గోధుమ‌లు, వ‌రికి మంచి మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 20 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఇలా మ‌రెన్నో హామీల‌తో ఆమె ప్ర‌జ‌ల‌ను త‌మ వైప తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఆమె కృషి ఫ‌లించి యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందేమో చూడాలి.