ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. పార్టీకి చంద్ర‌బాబు ఇస్తున్న సందేశ‌మేంటి?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ను ఆయ‌న క‌లిశారు. ఏపీలో త‌మ పార్టీ నేత‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను.. అధికార పార్టీ దూకుడును కూడా ఆయ‌న వివ‌రించారు. మొత్తంగా రెండు రోజుల పాటు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను పెట్టుకున్న చంద్ర‌బాబు.. త‌న స‌హ‌జ ధోర‌ణిలో.. కేంద్రంలోని పెద్ద‌ల‌కు ఏపీపై ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. స‌హ‌జంగా చంద్ర‌బాబు చేసే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌కు.. ఇప్పుడు చేసిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు మ‌ధ్య చాలా తేడా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో చంద్ర‌బాబు.. ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా.. అతి త‌క్కువ మందితోనే వ‌చ్చేవారు. అదే స‌మ‌యంలో కీలక‌మైన వారికే ప్రాధాన్యం ఇచ్చేవారు. త‌న వెంట ఉండ‌నిచ్చేవారు. వీరిలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. స‌హా ఒకరిద్ద‌రికి మాత్ర‌మే ప్రాదాన్యం ఉండేది. అయితే.. ఈ ద‌ఫా అనూహ్యంగా.. ఒక పెద్ద బృందాన్నే చంద్ర‌బాబు త‌న‌వెంట తీసుకువెళ్లారు. వీరిలో నిజానికి ఢిల్లీలో అవ‌స‌రం లేన‌వారు కూడా ఉన్నారు. వాస్త‌వానికి డిల్లీ లో చ‌క్రం తిప్పుతున్న వారిలో రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల రవీంద్ర కుమార్‌, ఎంపీ.. రామ్మోహ‌న్ నాయుడు.. ఇలా కొంద‌రు మాత్ర‌మే ఉన్నారు.

సో. వీరిని తీసుకువెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపితే స‌రిపోతుంది. కానీ, మాజీ మంత్రులు.. కాల్వ శ్రీనివాసులు, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, అచ్చ‌న్నాయుడు, ఎమ్మెల్యేలు.. ప‌య్యావుల కేశ‌వ్‌, డోలా బాల వీరాంజ‌నేయ స్వామితోపాటు.. మ‌హిళా నేత‌లు.. వంగ‌ల పూడి అనిత‌, పంచుమ‌ర్తి అనురాధ‌, ఎంపీలు కేశినేని నాని, ఇంకా మ‌రింత మంది నాయ‌కుల‌ను చంద్ర‌బాబు త‌న బృందంలో తీసుకువెళ్లారు. స‌రే.. ఇంత మంది వెళ్తేనే త‌ప్ప‌.. రాష్ట్ర‌ప‌తి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌రా.? అంటే.. కేవ‌లం ఐదుగురిని మాత్ర‌మే లోప‌ల‌కు అలౌ చేస్తారు. సో.. ఇంత మంది వెళ్లినా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

అయిన‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు వీరిని ఎందుకు తీసుకువెళ్లారు? అంటే.. పార్టీలో ఒక కీల‌క‌మైన సందేశాన్ని ఇవ్వ‌డానికే బాబు ఇలా వీరిని వెంటేసుకు వెళ్లార‌నే చ‌ర్చ సాగుతోంది. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఏం చేసినా.. కొంద‌రికి మాత్రమే చెప్పేవారు. దీంతో గోప్య‌త పాటిస్తున్నార‌నే వాద‌న‌.. త‌మ అధినేత త‌మ‌కే చెప్ప‌డం లేద‌నే ఆవేద‌న నేత‌ల్లో క‌నిపించేది. అయితే.. దీనిని పెద్ద సీరియ‌స్‌గా భావించ‌ని చంద్ర‌బాబు త‌న దారిలో తాను న‌డిచారు. అయితే.. ఇప్పుడు.. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో నేత‌ల‌ను ఏకం చేసుకునేందుకు.. ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇక‌పై అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. బాబు.. వెంట భారీ బృందం ఉండ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.