జ‌గ‌న్‌ రెండేళ్ల పాల‌న‌పై పుస్త‌కం: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌క పాల‌న‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే రెండున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌పై తాము రూపొందించిన పుస్త‌కాన్ని రాష్ట్ర‌ప‌తికి అంద‌జేశారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌ను తొక్కేస్తున్న తీరు స‌హా.. పోలీసు వ్య‌వ‌స్థ‌ను గుప్పిట‌లో ఉంచుకుని..రాజ్యాంగాన్ని సైతం ధిక్క‌రిస్తున్న‌తీరును రాష్ట్ర‌ప‌తికి చంద్ర‌బాబు వివ‌రించారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎంపీలు.. మ‌హిళా నేత‌ల‌తో భారీ బృందంగా ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు..ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం నివేదిక అందజేసింది. మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ, ఆర్ధిక దివాలా, ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసులు స‌హ‌క‌రిస్తున్న తీరు వంటి ప‌లు అంశాలపై రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి టిడిపి నేతలు విజ్ఞప్తి చేశారు.

అనంత‌రం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. స్టేట్ స్పాన్స‌ర్డ్‌ టెర్ర‌రిజంపై రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేసిన‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో 23 ఎక‌రాల్లో గంజాయి సాగు అవుతోంద‌ని.. ఎక్క‌డ గంజాయి ఉన్నా..ఏపీతో లింకులు ఉన్న విష‌యాన్ని రాష్ట్ర‌ప‌తి చెప్పామ‌న్నారు. ప్ర‌జాప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ పోరాడుతుంటే.. టీడీపీ ఆఫీస్‌పై దాడులు చేశార‌ని అన్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డూ ఇలాంటి రాజ‌కీయాలు చూడ‌లేదన్నారు. రాష్ట్రంలో ఆర్టిక‌ల్ 356 ప్ర‌యోగించాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోరామ‌న్నారు.

ఇప్పుడు క‌నుక రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్ట‌క‌పోతే… ఏపీలో సాగుతున్న మాద‌క ద్ర‌వ్యాల విచ్చ‌ల‌విడి సంస్కృతి ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా పాకే ప్ర‌మాదం ఉంద‌ని రాష్ట్ర‌ప‌తికి వివ‌రించిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. అదేస‌మ‌యంలో నాలుగు ప్ర‌ధాన అంశాల‌ను రాష్ట్ర‌ప‌తి ముందుకు పెట్టిన‌ట్టు బాబు తెలిపారు. డీజీపీని రీకాల్ చేయాల‌ని కోరామ‌న్నారు. కేవ‌లం రీకాల్తోనే స‌రిపెట్ట‌కుండా.. ఆయ‌న‌ను విచారించాల‌ని.. స్టేట్ స్పాన్స‌ర్డ్ టెర్ర‌రిజంలో ఆయ‌న భాగ‌స్వామిఅని అందుకే ఆయ‌న‌ను విచారించాల‌ని కోరిన‌ట్టు చెప్పారు.

కాగా, త‌మ ఫిర్యాదుల‌పై రాష్ట్ర‌ప‌తి సానుకూలంగా స్పందించిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు సీరియ‌స్‌గా ఉన్నాయ‌ని.. రాష్ట్ర‌ప‌తి అన్న‌ట్టు బాబు తెలిపారు. దీనిపై ఏం చేయాలో అది చేస్తామ‌ని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ నేత‌ల‌ను అణిచి వేస్తున్నార‌న్న చంద్ర‌బాబు.. వారి ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తిస్తున్న‌ట్టు చెప్పారు. నాకుల‌కు మానసిక ఇబ్బందులు.. క‌లిగిస్తున్నారని అన్నారు. గ‌తంలో జ‌గ‌న్ తాత రాజారెడ్డి చేసిన‌ట్టుగానే ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నాడని విమ‌ర్శించారు. వీట‌న్నింటిపైనా తాము ఒక 400 పేజీల‌తో కూడిన పుస్త‌కాన్ని రూపొందించామ‌ని.. త్వ‌ర‌లో మీడియాకు.. ప్ర‌జ‌ల‌కు కూడా అందిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.