ఏపీలోనూ పార్టీ పెట్ట‌మంటున్నారు.. కేసీఆర్

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ ప్లీన‌రీ హైటెక్స్ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. తొలి రోజు.. పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకున్నారు. పార్టీ అధ్య‌క్షుడిగా మరోసారి.. కేసీఆరే ఎన్నిక‌య్యారు. అనంత‌రం అధ్య‌క్షుడి హోదాలో ఆయ‌న తొలి ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఉపాధి కోసం.. రాష్ట్ర ప్ర‌జ‌లు.. ఉమ్మ‌డి రాష్ట్రంలో పాలమూరు నుంచి బొంబాయికి వలస వెళ్లేవారని పేర్కొన్నారు. అయితే.. పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. వారి క‌ష్టాల‌ను తాము వెలుగులోకి తెచ్చి.. వ‌ల‌స‌లు త‌గ్గించేందుకు కృషి చేసిన‌ట్టు తెలిపారు.

టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను పొరుగు రాష్ట్రాలు కాపీ కొట్టే ప‌రిస్థితికి తాము తీసుకువ‌చ్చామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. మ‌హారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో తెలంగాణ తరహా పథకాలు అమలుచేయాలని కోరుతున్నాయ‌న్నారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు తెలంగాణలో కలపాలని కోరుతున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ముఖ్యంగా ‘దళితబంధు’ ప‌థ‌కం ప్రకటించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయన్నారు. ఏపీలోనూ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని ఎంతో మంది కోరుతున్న విష‌యాన్ని చెప్పారు.

ఒక‌ప్పుడు వ‌ల‌స‌ల‌కు పుట్టిల్లుగా ఉన్న తెలంగాణ‌లో ఇప్పుడు పూర్తిగా ప‌రిస్థితి మారిపోయింద‌ని కేసీఆర్ చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో కూలీలు వచ్చి తెలంగాణ‌లో పనిచేస్తున్నారని ఆయ‌న చెప్పారు. తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని దుష్ప్రచారం చేశార‌న్న కేసీఆర్ తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ప్రచారం చేశారని విప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం వస్తే భూముల ధరలన్నీ పడిపోతాయని దుష్ప్రచారం చేశార‌ని విమ‌ర్శించారు. త‌మ ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశామ‌ని చెప్పారు. ఎఫ్‌సీఐ కూడా కొనలేమని చెప్పేస్థాయిలో వరి పండించామ‌ని తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో దేశంలోనే నంబరు వన్‌గా నిలిచామ‌న్నారు.

తొలిసారి 2001లో జలదృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించిన విష‌యాన్ని ప్లీన‌రీలో గుర్తు చేసిన కేసీఆర్‌.. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పార్టీ జెండా ఎగరేశామ‌ని తెలిపారు. కొద్దిమంది మిత్రులతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంద‌న్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ స్వాతంత్య్రం పోరాటం ఆనాడు ఆగని విధంగా ప్ర‌త్యేక రాష్ట్రంలో కోసం తాము సాగించిన పోరాటానికికూడా అనేక ఇబ్బందులు వ‌చ్చాయ‌ని తెలిపారు. అయినా.. ఎక్క‌డా ఉద్య‌మం ఆగ‌లేద‌ని తెలిపారు. రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశాన‌ని చెప్పారు. మొత్తంగా అటు పాత ఇటు కొత్త సంగ‌తుల మేళ‌వింపుతో కేసీఆర్ త‌న ప్ర‌సంగం కొన‌సాగించారు.