‘నాలుగైదు రోజులుగా పొట్టు పొట్టు అవుతోంది’.. కేసీఆర్ పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య

సాధారణంగా ముఖ్యమంత్రి కమ్ పార్టీ బాస్ కమ్ తండ్రి కేసీఆర్ మీద నేరుగా వ్యాఖ్యలు చేయడం లాంటివి మొదట్నించి కేటీఆర్ మాటల్లో కనిపించదు. వినిపించదు. ఎప్పుడో ఒకసారి అరుదుగా ఆయన మాటల్లో తన తండ్రి ప్రస్తావన వస్తుంది. అప్పుడు కూడా బాస్ అని ప్రస్తావిస్తారే కానీ.. నాన్న అన్న మాటను తీసుకురారు. అలాంటి కేటీఆర్.. తాజాగా ‘బాస్’ గురించి మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వేదికగా మారింది.

తాను గడిచిన ఐదు రోజులుగా కార్యకర్తలతో మాట్లాడుతుంటే మంచి సూచనలు వస్తున్నాయని.. వాటిని ప్రారంభించాల్సిందిగా చెప్పానని చెప్పారు. ‘మా బాస్ పెట్టిన పనితో నాకు నాలుగైదు రోజులు నుంచి పొట్టు పొట్టు అవుతోంది. ఇక్కడ ఒర్రి ఒర్రి గొంతు పోతోంది. నేను నాలుగైదు రోజులుగా ఫైళ్లు కూడా చూడటం లేదు. సభ వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుంది’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపే సంస్థాగతంగా బలపడతామని.. నవంబరు ఒకటి తర్వాత వరంగల్ కు వెళతామన్నారు. ఖాళీగా ఉన్న కొన్ని కార్పొరేషన్ పదవుల విషయాన్ని పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి.. సీనియర్ నేతలకు న్యాయం చేస్తానన్నారు. తాము గుజరాత్ గులాములం కాదని.. ఢిల్లీ బానిసలం కాదన్నారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే తల వొగ్గుతామని.. శిరస్సు వంచుతామే తప్పించి.. ఎవరి ముందు తల వంచమన్నారు.

ప్రధానమంత్రే తమ పథకాల్నికాపీ కొడుతున్నారని.. అదేదో దురుద్దేశాన్ని ఆపాదించేందుకు తానీ మాట చెప్పటం లేదని.. అది తమకు అభినందనగా భావిస్తామన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని రాష్ట్రంలో హడావుడి చేస్తున్న బీజేపీ నేతలు గుర్తించాలన్నారు. పార్టీలో కేడర్ కు లీడర్ కు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని.. ప్రభుత్వంపై కొంత ఎక్కువ దృష్టి పెట్టి.. పార్టీపై పెట్టకపోవటం వల్ల కొంత గ్యాప్ ఉందని.. ఆ స్తబ్దతను వదిలించుకొని బయటకు రావాల్సి ఉందన్నారు.