ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు

ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరుకోబోతున్నాయి. ఇటు అధికార వైసీపీ అటు ప్రధాన ప్రతిపక్షం మధ్య మొదలైన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని టీడీపీ నేత పట్టాభి అనుచితమైన పదాన్ని వాడటం, దాంతో ఒళ్ళు మండిన వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయటంతో రాజకీయంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. దాంతో చంద్రబాబునాయుడు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. దాని తర్వాత 36 గంటల నిరసన దీక్షకు దిగారు. పోటీగా వైసీపీ నేతలు నిరసనలు, ప్రజాగ్రహ దీక్షలు చేశారు. ఇవన్నీ ఇలా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సందర్భంలో వైసీపీ కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి టీడీపీపై నిషేధం విధించాలని డిమాండ్ చేయబోతోంది. టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదని జనాలను రెచ్చగొట్టే తీవ్రవాద స్వభావం ఉన్న పార్టీగా ఆరోపణలు చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సమాజంలో అస్థిరత సృష్టించేందుకు టీడీపీ చేసిన, చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు వివరించేందుకు వైసీపీ ఎంపీలు ఢిల్లీ చేరుకుంటున్నారు. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో మొదలైన అశాంతిని ఉదాహరణగా చూపబోతోంది. కాబట్టే టీడీపీకి ఎన్నికల్లో పాల్గొనే అర్హత లేదని వైసీపీ నేతలు చెప్పబోతున్నారు. అలాగే రాష్ట్రపతిని, కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలిసి టీడీపీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేయబోతున్నారు.

ఇదే సమయంలో దీక్ష ముగియగానే చంద్రబాబు నేతృత్వంలో ఎంపిలు, సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వివరించబోతున్నారు. హెరాయిన్, గంజాయి విచ్చలవిడిగా ఎలా వ్యాపారం జరుగుతోందో చెప్పనున్నారు. శాంతి, భద్రతలకు జరుగుతున్న విఘాతాన్ని ఉదాహరణలతో సహా వివరించనున్నారు. తమ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడుల ఫొటోలు, వీడియోలను ఇవ్వనున్నారు. వెంటనే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించటం ఒకటే మార్గమని చంద్రబాబు డిమాండ్ చేయబోతున్నారు.

చంద్రబాబు డిమాండ్ తో ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేస్తారని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు చెబుతున్నట్లు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఇబ్బంది ఏదైనా ఉంటే అది వైసీపీ-టీడీపీల మధ్య మాత్రమే అని అందరికీ తెలిసిందే. ఇదే సందర్భంలో వైసీపీ డిమాండ్ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ టీడీపీపై బ్యాన్ పెడుతుందని కూడా అనుకోవడం లేదు.

ఏదో ఏపి రాజకీయాలను ఢిల్లీకి తీసుకెళ్ళి జాతీయస్థాయిలో కాస్త హడావిడి చేయడానికి తప్ప వీళ్ళ గోల ఎందుకూ పనికిరాదు. పైగా ప్రాంతీయ పార్టీల మధ్య మంటలు పుట్టించి చలికాచుకోవటం బీజేపీ ఎలాగో తెలుసు. చంద్రబాబు డిమాండ్ తో వైసీపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని ఎవరు అనుకోవడం లేదు. మొత్తానికి యాక్షన్-రియాక్షన్ ఎలాగున్నా ఏపీ రాజకీయ వేడి ఢిల్లీకి చేరుకుంటున్నది మాత్రం వాస్తవం.