తమ్ముళ్ళకే శీల పరీక్ష పెట్టారా ?

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో నేతలకే శీలపరీక్ష పెట్టినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు పెద్దగా క్రియాశీలకంగా లేరు. సీనియర్లంటే మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా చాలామంది ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా బాగా పెత్తనం చేసిన వారిలో చాలామంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పెద్దగా కనబడటం లేదన్నది వాస్తవం.

ఎంతసేపు చంద్రబాబు లేకపోతే లోకేష్ కాకపోతే అచ్చెన్న, బుచ్చయ్య చింతకాయల లాంటి అతికొద్దిమంది నేతలు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. చెప్పుకోవటానికి వందలాది మంది సీనియర్లు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకని పోరాటాలు చేయటం లేదో ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని పిలుపులిచ్చినా ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదన్న విషయం చంద్రబాబును బాగా కలచివేస్తోందట.

సరే హఠాత్తుగా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వివాదం మొదలైంది. జగన్ను పార్టీ నేత నోటికొచ్చినట్లు తిట్టడంతో మండిపోయిన వైసీపీ నేతలు పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడులకు ప్రతిగా చాలామంది తమ్ముళ్ళ నుంచి పెద్దగా స్పందన కనబడలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని చంద్రబాబు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. అసలు బంద్ కు పిలుపిచ్చింది ఎందుకంటే పార్టీలోని నేతల్లో ఎంతమంది యాక్టివ్ గా పాల్గొంటారో చూడటం కోసమేనట.

అయితే ఇక్కడ కూడా చంద్రబాబు అంచనా తప్పినట్లు అర్ధమైపోయింది. చాలామంది సీనియర్లు తమ నియోజకవర్గాల్లో కనబడలేదు. సీనియర్ల సంగతిని వదిలేస్తే మెజారిటి ఎంఎల్ఏలు కూడా అడ్రస్ కనబడకపోవటంతో చంద్రబాబు మండిపోతున్నారట. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అచ్చెన్నాయుడు, రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి లాంటి ఒకరిద్దరు తప్ప చాలామంది బంద్ సందర్భంగా కూడా రోడ్లపైకి రాలేదని అర్ధమైపోయిందట.

దాంతో నేతలపై మండిపోయిన చంద్రబాబు వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదని అర్ధం చేసుకున్నారు. అందుకనే హఠాత్తుగా 36 గంటల నిరసన దీక్షకు దిగారు. తాను దీక్ష చేస్తే అన్నా తమ్ముళ్ళు నియోజకవర్గాల్లో సంఘీభావంగా దీక్షలకు కూర్చుంటారేమో అని చంద్రబాబు అనుకున్నారట. మరి ఎంతమంది తమ్ముళ్ళు తమ నియోజకవర్గాల్లో దీక్షలకు కూర్చున్నారనే విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలోని బాధ్యులు ఆరాలు మొదలుపెట్టారు. మొత్తానికి చంద్రబాబు తమ్ముళ్ళకే శీలపరీక్ష పెట్టారట.