అద్వానీకి బీజేపీ అంద‌లం.. రీజ‌నేంటంటే!

లాల్ కృష్ణ అద్వానీ.. దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన పేరు. కాదుకాదు.. బీజేపీ నాయ‌కులే అలా మ‌రిచి పోయేలా చేసిన పేరు.. ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ఇప్పుడు ఏ రామ‌జ‌న్మ భూమి.. రామ‌మందిరం.. అని బీజేపీ అడుగులు వేస్తోందో.. దానికి పునాదులు వేసింది.. అద్వానీనే! కానీ.. మోడీ హ‌యాంలో 2014 నుంచి నానాటికీ తీసిక‌ట్టుగా మారిన అద్వానీ ప‌రిస్థితి.. ఇప్పుడు క‌నుచూపు మేర‌లో కూడా క‌నిపించ డం లేదు. ఆయ‌న మాట ఎక్క‌డా వినిపించ‌డ‌మూ లేదు. దీనంత‌టికీ కార‌ణం.. మోడీ-అమిత్ షా ద్వ‌య‌మేన‌ని అంటారు.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా మ‌రోసారి అద్వానీ పేరు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక్క అద్వానీనే కాదు.. ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి పేరు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. పార్టీ అజెండా రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే జాతీయ కార్యనిర్వాహక బృందంలో 80 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కేంద్ర మంత్రులు, పలువురు రాష్ట్రాల నాయకులు, పార్టీ సీనియర్ నేతలైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఉన్నారు.

దీనికి కార‌ణం ఏంటి? అంద‌రూ మ‌రిచిపోయార‌ని అనుకున్న అద్వానీ పేరు ఒక్క‌సారిగా తెర‌మీదికి తీసు కురావ‌డంలో ఆంత‌ర్యం ఏంటి ? అంటే.. ఉత్తర ప్ర‌దేశ్‌లో మ‌రికొన్నాళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యం. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. కొంత వ్య‌తిరేక‌త కొడుతోంది. ఈ నేప‌థ్యంలో యూపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయ‌కుడు, రామమందిరం కోసం.. ర‌థ‌యాత్ర‌ను న‌డిపిన నాయ‌కుడిగా పేరున్న అద్వానీని ముందుకు తీసుకువ‌చ్చి.. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

లేక‌పోతే.. ఇన్నాళ్లు మ‌రిచిపోయిన‌.. అద్వానీకి ఇప్పుడు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇక‌, ఇదేస‌మ‌యంలో ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషికి ప్రాధాన్యం పెంచ‌డం ద్వారా .. హిందూత్వ కార్డును మ‌రింత బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కేవ‌లం యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అద్వానీ.. జోషిల‌కు ప్రాధాన్యం పెర‌గ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఈ కార్యనిర్వాహక బృందంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇటీవలే మంత్రివర్గంలో చేరిన అశ్వినీ వైష్ణవ్ సహా పలువురి పేర్లు ఉన్నాయి. మాజీ మంత్రులు హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్కూ చోటు కల్పించారు. 80 మంది సాధారణ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది, శాశ్వత ఆహ్వానితులుగా 179 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. అదేవిధంగా ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చోటు లభించగా.. తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహనరావుకు చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పించారు.