ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చేసిన కేసీఆర్

ప్రతిది లెక్కగా చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత పక్కాగా ఉంటారన్నది తెలిసిందే. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నమైన పద్దతుల్ని ఆయన అనుసరిస్తుంటారు. గత ఎన్నికల సమయంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ల ఇచ్చిన కేసీఆర్.. ఏడుగురిని మాత్రమే మార్చి కొత్త వారిని బరిలో నిలిపారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల పని తీరును గ్రేడ్ల వారీగా మదింపు చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లోనూ అదే విధానాన్ని అమలు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు.

గతంలో మాదిరి ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసిన కేసీఆర్.. ఈసారి ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు మీద గ్రేడింగ్ తీయించామని.. అందులో చాలామంది ఏ గ్రేడ్ లో ఉంటే.. కొందరు మాత్రం బీ.. సీ గ్రేడుల్లో ఉన్నారని చెప్పారు.

గత ఎన్నికల్లో సీ గ్రేడ్ లో ఉన్న వారి పనితీరు మార్చుకోవాలని చెప్పానని.. మార్చుకోని కారణంగా వారిని మార్చినట్లు చెప్పారు. ఇప్పటికైనా సరే.. బీ..సీ.. గ్రేడుల్లో ఉన్న వారు తమ గ్రేడ్ ను మెరుగుపర్చుకోవాలన్నారు.

టికెట్ల ఎంపికకు తాను జరిపే సర్వేలో వచ్చే గ్రేడ్లను ఆధారంగా తీసుకుంటానన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు కేసీఆర్. కొత్త వారితో కంటే పాత వారికే టికెట్లు ఇవ్వటానికి తాను ఇష్టపడతానని చెప్పటం ద్వారా.. సిట్టింగులకే మరోసారి టికెట్ ఖాయమన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

కొత్తవారిని తీసుకొస్తే వారిని తయారు చేసుకోవటానికి టైం పడుతుందని.. అదే పాతవారైతే.. వారికి అనుభవం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం ద్వారా.. సిట్టింగులకు సంతోషాన్ని ఇచ్చారు. అయితే.. మొత్తం ఎమ్మెల్యేల్లో ఎంత మంది బీ.. సీ.. గ్రేడుల్లో ఉన్నారన్న విసయాన్ని చెప్పనప్పటికీ.. గ్రేడ్లను మెరుగుపర్చుకోకుంటే ఎన్నికల నాటికి కష్టమన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేశారని చెప్పాలి.