టాలీవుడ్‌కు ‘పండుగ’ తెచ్చేదెవరో?

తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా సినిమాల వైపు చూసే సీజన్లలో దసరా ఒకటి. స్కూళ్లు, కాలేజీలకు పది రోజుల పాటు సెలవులుండే ఈ సీజన్లో మామూలుగా భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. గత ఏడాది కరోనా కారణంగా ఈ సీజన్లో అసలు సినిమాలే లేవు. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం కొంత కొనసాగుతుండటంతో ఒకప్పటి స్థాయిలో భారీ చిత్రాలు దసరా రేసులో లేవు. కానీ మూడు మీడియం రేంజ్ సినిమాలు ఈసారి బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాయి. అందులో ముందు రాబోతున్నది, ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది అంటే.. మహాసముద్రం మూవీనే.

‘ఆర్ఎక్స్ 100’తో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి స్క్రిప్టు సిద్ధం చేసుకోవడంలో, దీన్ని పట్టాలెక్కించడంలో ఆలస్యం జరిగినా.. అజయ్ సాలిడ్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని దీని ప్రోమోలు చూస్తే అర్థమైంది. దీని కాస్టింగ్ ఎంతో ఆసక్తి రేకెత్తించింది. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, రావు రమేష్, జగపతిబాబుల కాంబినేషన్ భలేగా అనిపించింది. కథేంటో చెప్పకుండా ఆసక్తికరమైన షాట్స్‌తో రెండు ట్రైలర్లూ ఆసక్తి రేపాయి. సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వాటిని గురువారం రిలీజవుతున్న సినిమా ఏమేర అందుకుంటుందో చూడాలి.

ఇక దసరా రోజు, శుక్రవారం అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజవుతోంది. తొలి హిట్ కోసం చూస్తున్న అఖిల్‌కు, కమ్ బ్యాక్ కోసం చూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్‌కు ఈ సినిమా హిట్టవడం చాలా కీలకం. సినిమాకు ఆడియో, టీజర్, ట్రైలర్ ఆకర్షణగా నిలిచించి. మంచి బజ్‌తోనే సినిమా రిలీజవుతోంది. మరి దసరా రోజు ఇదెంత సందడి చేస్తుందో చూడాలి.

ఇక పై రెండు చిత్రాలతో గట్టి పోటీ ఉన్నప్పటికీ, అనుకున్నంత క్రేజ్ లేకపోయినప్పటికీ ‘పెళ్ళి సందడి’ చిత్రం కూడా శుక్రవారమే విడుదలకు సిద్ధమైంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరి రోనంకి అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందించింది. రాఘవేంద్రరావు నిర్మాణంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణలోనూ భాగం పంచుకున్నారు. మరి ఆయన తీసిన ‘పెళ్ళిసందడి’ మ్యాజిక్‌ను ఈ కొత్త ‘పెళ్ళిసందడి’ పునరావృతం చేస్తుందేమో చూడాలి.