బ్రేకింగ్: ప్రకాష్ రాజ్ ప్యానెల్ కీలక నిర్ణయం..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా.. ‘మేమంతా ఒకటే ఫ్యామిలీ.. అందరం కలిసి పని చేస్తామనే’ మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులంతా ‘మా’ని వీడబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాష్ రాజ్.. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.

“ఎలెక్షన్స్ అయిపోయాయి.. రిజల్ట్స్ వచ్చాయి.. సినిమా బిడ్డలు ప్యానెల్ చాలా ఆశలతో పోటీ చేసింది. మా ప్యానెల్ నుంచి కొంతమంది ఎన్నికయ్యారు. క్రాస్ ఓటింగ్స్ జరిగాయి. సగం మంది ఈ ప్యానెల్ నుంచి సగం మంది విష్ణు ప్యానెల్ నుంచి ఎన్నుకున్నారు. ఎన్నికలకు ముందు చాలా రౌడీయిజం జరిగింది. మాటల పోరు జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో అన్యాయం జరిగింది. అయినా.. ఎలెక్షన్స్ ఆగకూడదని అన్నారు. ఎక్కడెక్కడనుంచో మనుషులను తీసుకొచ్చారు. బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రానికి మా ప్యానెల్ నుంచి మొత్తం 11 మంచి ఈసీ మెంబర్స్ ఉన్నారని అన్నారు. కానీ నెక్స్ట్ డేకి రిజల్ట్ మారిపోయింది. ఎనిమిది మందే ఉన్నట్లు చెప్పారు” అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

ఆ తరువాత.. అందరినీ కలుపుకొని వెళ్తామని చెప్పిన మంచు విష్ణు.. గెలిచిన తరువాత పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు నచ్చలేదని ప్రకాష్ రాజ్ అన్నారు. ‘మీరు-మేము’ అని అనుకుంటే కలిసి పని చేయగలమా..? అని ప్రశ్నించానని ప్రకాష్ రాజ్ తెలిపారు. గెలిచిన తమ ప్యానెల్ సభ్యులు కూడా అక్కడ పని చేయగలమా..? అని తనను అడుగుతున్నారని.. ‘మా’ సంక్షేమ కార్యక్రమాలు ఆగి గొడవలతో నిండిపోతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో తమ ప్యానెల్ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామని.. ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు ప్రకాష్ రాజ్. విష్ణు ఇప్పుడు తనకు కావాల్సిన వాళ్లను పెట్టుకొని పని చేస్తే మేం బయట నుంచి చూస్తామని అన్నారు ప్రకాష్ రాజ్. విష్ణు వచ్చే రెండేళ్లు బాగా పనిచేయాలని.. పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని నెరవేర్చాలని అన్నారు. కానీ తమకు ఓటేసిన వారికి అన్యాయం చేస్తే వారి కోసం ప్రశ్నిస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక తన ‘మా’ సభ్యత్వం గురించి మాట్లాడుతూ.. బైలాస్ మార్చి తెలుగువాడు కాని వాడు కూడా పోటీచేయొచ్చనే రూల్ పెడితే తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని వివరించారు.