కోహ్లి కంట నీరు.. కదిలిపోయిన ఫ్యాన్స్


ఈ సాలా కప్ నమదే.. ఐపీఎల్ ఆరంభమయ్యే ముందు చాలా గట్టిగా వినిపించే నినాదం ఇది. లీగ్‌లో గెలవాలని ప్రతి జట్టూ ప్రయత్నిస్తుంది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల కోరిక మిగతా వాళ్లతో పోలిస్తే చాలా బలమైంది. కానీ ఎంత బలంగా కోరుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ జట్టు టైటిల్ సాధించలేదు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే.. ఆ తర్వాత కోహ్లి.. ఇలా లెజెండరీ స్టేటస్ ఉన్న ఆటగాళ్లే ఆ జట్టును నడిపించారు. వెటోరి, గేల్, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ లాంటి మేటి ఆటగాళ్లు చాలామంది ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆ జట్టుకు కప్పు అందించలేకపోయారు. 2016లో ఫైనల్ చేరి త్రుటిలో కప్పు చేజార్చుకున్నాక ఆ జట్టు ప్రదర్శన పడిపోయింది. గత మూడు సీజన్లలోనూ కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదా జట్టు. ఈసారి బాగా ఆడి ప్లేఆఫ్స్ చేరింది కానీ.. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.

లీగ్ దశలో టాప్-2లో నిలవకపోవడం వల్ల ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీకి రెండో అవకాశం లేకపోయింది. ముందు ఎలిమినేటర్‌లో గెలవాలి. ఆ తర్వాత రెండో క్వాలిఫయర్‌లో విజయం సాధించాలి. అప్పుడే ఫైనల్ అవకాశం దక్కుతుంది. ఐతే ఆర్సీబీ ఎలిమినేటర్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కోల్‌కతాతో మ్యాచ్‌లో బాగానే పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. సునీల్ నరైన్ బంతితో, బ్యాటుతో విజృంభించి ఆ జట్టు ఆశలకు గండి కొట్టాడు. ఈ మ్యాచ్ ఓడిపోగానే సోషల్ మీడియాలో కోహ్లి అభిమానుల బాధ అంతా ఇంతా కాదు.

బెంగళూరు మధ్యలో నిష్క్రమించడం, టైటిల్ అందుకోకపోవడం వాళ్లకు కొత్తేమీ కాదు కానీ.. విరాట్‌కు బెంగళూరు కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్ కావడంతో ఈ వైఫల్యాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన కొన్ని రోజులకే.. యూఏఈలో ఈ సీజన్ రెండో అంచె ఆరంభానికి ముందు ఐపీఎల్లో బెంగళూరు కెప్టెన్సీకి కూడా ఈ సీజన్ తర్వాత గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు కోహ్లి.

ఇక అప్పట్నుంచి కోహ్లి చివరి ప్రయత్నంలో అయినా టైటిల్ సాధిస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. జట్టు సహచరులు, అభిమానులు బలంగా కోరుకున్నారు కానీ.. ఈసారి కూడా ఆర్సీబీకి నిరాశ తప్పలేదు. ఎప్పుడూ పెద్దగా ఎమోషనల్ అవని కోహ్లి.. ఈ మ్యాచ్ అనంతరం ఎంతో ఆవేదనతో కనిపించాడు. మ్యాచ్ ప్రెజెంటేషన్లోనే అతడి కళ్లలో బాధ కనిపించింది. ఇక ఆ తర్వాత టీం మేట్స్‌తో మాట్లాడుతున్న సమయంలో అతను ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు. తీవ్ర ఆవేదనతో కోహ్లి ఫ్యాన్స్ పోస్టులు పెట్టి తమ హీరోను ఓదార్చే ప్రయత్నం చేశారు.