యూపీలోనే కాదు, ఉత్తరాఖండ్ లోనూ బీజేపీకి చావు దెబ్బ

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ లో రైతుల గోల పెరిగిపోతుంటే పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ లో ముసలం మొదలైనట్లే ఉంది. రెండు రాష్ట్రాల్లోను బీజేపీనే అధికారంలో ఉండటంతో అధికార పార్టీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాఖండ్ లో ఓ మంత్రి తన కొడుకుతో పాటు హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఒక మంత్రే ఓ ఎంఎల్ఏ తో కలిసి బీజేపీకి రాజీనామా ఇచ్చేసి కాంగ్రెస్ లో చేరిపోతారని బీజేపీ అగ్రనేతలు ఏమాత్రం ఊహించలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే సీఎం పుష్కర్ థామి సింగ్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న యశ్ పాల్ ఆర్య హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈయన కొడుకు, ఎంఎల్ఏ అయిన సంజీవ్ ఆర్య కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో తండ్రి, కొడుకులిద్దరు కాంగ్రెస్ లో చేరిపోవటాన్ని బీజేపీ అగ్రనేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఒకపుడు ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడిగా యశ్ పాల్ ఆర్య పనిచేశారు లేండి.

గడచిన నాలుగేళ్ళుగా ఉత్తరాఖండ్ లో బీజేపీ అవస్తలు పడుతునే ఉంది. అధికారంలో ఉందని తప్పిస్తే మిగిలిన అవస్తలంతా పడుతునే ఉంది. నాలుగేళ్ళలో ముగ్గురు సీఎంలు మారటమంటే పార్టీ ఎంతటి సంక్షోభంలో కొట్టుకుంటోందో అర్ధమవుతోంది. 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి మొదటి సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు తీసుకున్నారు. మూడున్నరేళ్ల తర్వాత ఎంఎల్ఏల్లో వచ్చిన తిరుగుబాటు కారణంగా ఆయన స్థానంలో తిరత్ సింగ్ రావత్ ను కుర్చీలో కూర్చోబెట్టారు.

అయితే ఎంపీగా ఉన్న తిరత్ ను సీఎంగా కూర్చోబెట్టడం తో వెంటనే ఎంఎల్ఏల్లో అసంతృప్తి మొదలైపోయింది. సాధారణ ఎన్నికలు దగ్గర పడటంతో ఉపఎన్నికలకు అవకాశం లేకపోయింది. దాంతో ఎంఎల్ఏల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు వెంటనే తిరత్ ను దింపేసింది. ఆయన స్ధానంలో పుష్కర్ సింగ్ థామిని సీఎంను చేసింది. ఇంత చేసినా మంత్రులు, ఎంఎల్ఏల్లో అసంతృప్తి చల్లారలేదని అర్ధమైపోయింది. ఇందులో భాగంగానే మంత్రి ఆర్య రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.

తొందరలోనే మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. జరుగుతున్నది చూస్తుంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ బీజేపీలో ముసలం మొదలవ్వబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. మరి ముసలం కారణంగా చివరకు బీజేపీ పుట్టి మునుగుతుంది ఏమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.