బుట్టా రేణుక‌కు మ‌ళ్లీ అవ‌కాశం!

2019 ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి గ‌ద్దెనెక్కిన జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అదే ప్ర‌ద‌ర్శ‌న పున‌రావృతం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌తో పాటు ఎంపీ సీట్ల‌నూ వైసీపీ భారీగా గెలుచుకుంది. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌లపై జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌తో పాటు ఎంపీ అభ్య‌ర్థుల‌ను కూడా ఎక్కువ సంఖ్య‌లో గెలిపించుకోవాల‌నే ఆయ‌న ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా దానికి వైసీపీ అవ‌స‌రం ప‌డాల‌నే ఉద్దేశంతో వీలైన‌న్నీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు జ‌గ‌న్ వ్యూహాలు ర‌చిస్తున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని అన్ని లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుత వైసీపీ ఎంపీల ప‌ని తీరు వాళ్ల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిప్రాయాల‌ను జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే క‌ర్నూలు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో జ‌గ‌న్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం అక్క‌డ వ‌రుస‌గా రెండు సార్లు బీసీ అభ్య‌ర్థిని నిల‌బెట్టి జ‌గ‌న్ గెలిపించుకున్నారు. 2014లో బుట్టా రేణుక 2019లో డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ అక్క‌డి నుంచి విజ‌యం సాధించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి బుట్టా రేణుక‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పెద్ద‌గా యాక్టివ్‌గా లేరు. పార్టీ బ‌లోపేతం విష‌యాంలోనూ ఆయ‌న దృష్టి సారించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

డాక్ట‌ర్‌గా సంజీవ్ కుమార్‌కు క‌ర్నూలు ప్రాంతంలో గొప్ప పేరుంది. ఆయ‌న‌ది బీసీ సామాజిక వ‌ర్గం కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పిలిచి మ‌రీ టికెట్ ఇచ్చారు. కానీ ఎంపీగా ఎన్నికైన సంజీవ్ కుమార్ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతున్నార‌న్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. అందుకే ఆయ‌న్ని దూరం పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి బుట్టా రేణుక‌ను నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. అందుకే క‌ర్నూలు ఎంపీగా మ‌రోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఆమెకు పార్టీ నుంచి సంకేతాలు అందిన‌ట్లు స‌మాచారం. 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె త‌ర్వాత టీడీపీలోకి వెళ్లారు. కానీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు తిరిగి వైసీపీ గూటికే చేరారు. కానీ అప్పుడు ఆమెకు టికెట్ కేటాయించ‌ని జ‌గ‌న్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. దీంతో ఆమెకు పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ టికెట్ ద‌క్కే వీలుంద‌ని తెలియ‌డంతో ఆమెతో పాటు ఆమె వ‌ర్గీయులు సంతోష‌ప‌డుతున్నారు.