రిపబ్లిక్ కథ అలా ముగిసింది


రిపబ్లిక్ సినిమా మీద దాని టీం అంతా చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా దర్శకుడు దేవా కట్టాకు ఈ సినిమాతో హిట్టు కొట్టడం చాలా అవసరం. ఆయనిది కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందని అనుకున్నారంతా. ఐతే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సీరియస్ మూవీకి ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. ఓపెనింగ్స్ దగ్గరే నిరాశ పరిచిన ‘రిపబ్లిక్’ తర్వాత కూడా పెద్దగా పుంజుకోలేదు. వీకెండ్లో రూ.4.5 కోట్ల దాకా షేర్ రాబట్టిన ఈ చిత్రం.. వారం రోజుల్లో రూ.6.5 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది.

రెండో వీకెండ్లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఫుల్ రన్లో ‘రిపబ్లిక్’ షేర్ రూ.7 కోట్ల మార్కుకు దగ్గరగా ఉంది. ఇంతకుమించి ఈ సినిమా నుంచి ఆశించడానికి ఏమీ లేదు. థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ అయినట్లే. రూ.7 కోట్ల షేర్‌కు ఫిక్సయిపోవచ్చు. ‘రిపబ్లిక్’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను రూ.12 కోట్లకు అమ్మారు. అంటే రికవరీ 60 శాతానికి పరిమితం అయిందన్నమాట. బయ్యర్లకు పెద్ద ఎత్తునే నష్టాలు వచ్చినట్లు అర్థమవుతోంది. ఐతే జీ స్టూడియోస్‌తో కలిసి ‘రిపబ్లిక్’ను నిర్మించిన జేబీ ఎంటర్టైటన్మెంట్స్ అధినేతలు భగవాన్, పుల్లారావులు అయితే సేఫ్ అయిపోయారు. థియేట్రికల్, ఇతర హక్కుల ద్వారా వారికి మంచి లాభాలే వచ్చినట్లు సమాచారం.

మరి కొన్ని రోజుల్లోనే ‘రిపబ్లిక్’ను జీ5 ఓటీటీలో స్ట్రీమ్ చేయబోతున్నారు. థియేట్రికల్ రన్ మీద ఆశల్లేవు కాబట్టి వీలైనంత త్వరగానే ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసే అవకాశముంది. ‘రిపబ్లిక్’ను హిట్ అనిపించడానికి దర్శకుడు దేవా కట్టా గట్టిగానే ప్రయత్నించాడు. హీరో సాయిధరమ్ తేజ్ కూడా అందుబాటులో లేకపోగా, మిగతా టీం నుంచి ఎవరూ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో పాల్గొనలేదు. సోషల్ మీడియా ద్వారా దేవా మాత్రం అలుపెరగని పోరాటం చేశాడు. ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ కామెంట్లన్నింటినీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ పది రోజుల నుంచి గట్టిగానే పోరాడుతున్నాడు దేవా.