మోడీపై పెరిగిపోతున్న ఒత్తిడి

తన మంత్రివర్గంలోని ఓ సహాయ మంత్రిని తప్పించే విషయంలో నరేంద్ర మోడిపై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాలు తదనంతర పరిణామాల నేపథ్యంలో సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలంటు డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా రెండు డిమాండ్లపైనే రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. మొదటిదేమో సహాయ మంత్రి కొడుకు, వివాదానికి మూల కారకుడైన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయటం, సహాయమంత్రిని తొలగించటం.

రైతుల రెండో డిమాండ్ అయిన ఆశిష్ అరెస్టు శనివారం జరిగిపోయింది. ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్న రైతులపైకి వెనకనుండి కార్లతో వచ్చి తొక్కించుకుని వెళ్ళిపోవటంతో వివాదం రాజుకుంది. ఆ ఘటనలో నలుగురు రైతులు చనిపోగా తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగుర చనిపోయారు. ఈ మొత్తాన్ని సుప్రింకోర్టు సూమోటోగా విచారణ మొదలుపెట్టింది. అలాగే రాష్ట్రం పరిధిలో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణ మొదలుపెట్టింది.

సిట్ విచారణకు హాజరైన ఆశిష్ ను విచారించి చివరకు అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ ను పోలీసులు అరెస్టు చేయటంతో రైతుల రెండో డిమాండ్ నెరవేరినట్లయ్యింది. మరి మొదటి డిమాండ్ అయిన అజయ్ మిశ్రా తొలగింపు మాటేమిటి ? ఇదే మోడికి పెద్ద తలనొప్పిగా తయారైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తున్నామంటు మోడి బిల్డప్ ఇస్తున్న విషయం అందరు చూస్తున్నదే.

ఇపుడు హఠాత్తుగా సహాయమంత్రిని తొలగించటమంటే బ్రాహ్మణులను దూరం చేసుకున్నట్లవుతుందని మోడి భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే రైతులపైకి వాహనాలు దూసుకెళినపుడు తన కొడుకు అసలు వాటిల్లో లేనేలేడని మంత్రి చెబుతున్నారు. ఇదే సమయంలో రైతులపైకి దూసుకెళ్ళిన వాహనాల్లో మంత్రి కొడుకున్నాడంటు రైతులు పదే పదే చెబుతున్నారు. దీంతో ఘటనా సమయంలో మంత్రి కొడుకు వాహనాల్లో ఉన్నాడా లేడా అన్నది పెద్ద పజిల్ అయిపోయింది.

ఇపుడు సమస్య ఎలాగైపోయిందంటే మంత్రిని తప్పించకపోతే రైతుసంఘాలతో సమస్య. అలాగని మంత్రివర్గంలో నుండి తప్పిస్తే బ్రాహ్మణ సామాజికవర్గంతో సమస్య. దీంతో ఏమి చేయాలో మోడికి అర్ధం కావటంలేదు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్న సమయంలో హఠాత్తుగా రేగిన వివాదంలో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక యోగి ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా తలలు బాదుకుంటోంది. రైతుసంఘాల ఆందోళనలు ఒకవైపు, ప్రతిపక్షాల ఆందోళనలు మరోవైపు రాష్ట్రంలో అగ్గిరాజేస్తున్నాయి. మరి ఇందులో నుడి మో ఎలా బయటపడతారో చూడాల్సిందే.