మరో గూఢచారి వస్తున్నాడోచ్


ఈమధ్య తెలుగు సినిమాల్లో గూఢచారులు ఎక్కువయ్యారు. కొన్నాళ్ల క్రితం ‘గూఢచారి’ పేరుతోనే సినిమా చేసి హిట్టు కొట్టాడు అడివి శేష్. ఇప్పుడు ఆ పాత్రతో సక్సెస్ సాధించాలని చూస్తున్నారు చాలామంది హీరోస్. ఒకరి తర్వాత ఒకరుగా స్పై థ్రిల్లర్స్‌ని అనౌన్స్ చేసి సర్‌‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ కూడా ఆ వరుసలో చేరాడు.

రీసెంట్‌గా ‘వైల్డ్‌ డాగ్‌’లో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నటించారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ‘ది ఘోస్ట్‌’లోనూ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు. ఆయన కొడుకు అఖిల్‌ ‘ఏజెంట్‌’ పేరుతో సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ‘డెవిల్‌’లో బ్రిటిష్ కాలం నాటి గూఢచారి పాత్ర పోషిస్తున్నాడు. తనదీ అదే దారి అంటూ నిఖిల్‌ కూడా ఓ స్పై థ్రిల్లర్‌‌ని స్టార్ట్ చేశాడు.

గూఢచారి, ఎవరు, హిట్ వంటి చిత్రాలకు ఎడిటర్‌‌గా పని చేసిన బీహెచ్ గ్యారీ ఈ సినిమాతో డైరెక్టర్‌‌గా మారుతున్నారు. ఆయన చెప్పిన ఓ గూఢచారి కథ నచ్చడంతో నిఖిల్ ఎస్ చెప్పాడు. ఇవాళ హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభించారు. రెడ్‌ సినిమాస్ బ్యానర్‌‌లో రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆల్రెడీ 18 పేజెస్‌ చిత్రంతో పాటు ‘కార్తికేయ’ సీక్వెల్‌లోనూ నటిస్తున్నాడు నిఖిల్. ఇవింకా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని స్టార్ట్ చేయడం విశేషం. చాలాకాలం కూల్‌ పాత్రల్లోనే కనిపించిన తను సడెన్‌గా రూటు మార్చి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఈ స్పై థ్రిల్లర్‌‌కి కమిటయ్యాడు. మరి గూఢచారిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.