ప్రభాస్, సందీప్‌ల ‘స్పిరిట్‌’

ఏ హీరో కెరీర్‌‌లో అయినా 25వ సినిమా ఓ మైల్‌ స్టోన్‌. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటారు. ఇక ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌‌ విషయంలో ఇంకెంత ప్లానింగ్ ఉంటుంది, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి! తన ట్వంటీ ఫిఫ్త్ మూవీ అనౌన్స్‌మెంట్ రాబోతోందని తెలియగానే ఏం సినిమా, డైరెక్టర్ ఎవరు, టైటిల్ ఏం పెట్టారు అంటూ ఒకటే ప్రశ్నలు. వాటన్నింటికీ సమాధానం దొరికేసింది. ప్రభాస్ 25వ సినిమా ప్రకటన వచ్చేసింది.

తన మైల్‌ స్టోన్ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను సందీప్ రెడ్డి వంగా చేతికి అప్పగించాడు ప్రభాస్. వీరి మూవీకి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి టీ సిరీస్ సంస్థ ప్యాన్ ఇండియా స్థాయిలో దీన్ని నిర్మించనుంది. ఆల్రెడీ యువీ క్రియేషన్స్ ప్రభాస్‌తో మిర్చి, సాహో చిత్రాలు తీసింది. ‘రాధేశ్యామ్’ కూడా తీస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.

నిజానికి ప్రభాస్ ఇరవై అయిదో సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ చివరికి చాన్స్ సందీప్‌కి దక్కింది. ‘అర్జున్‌రెడ్డి’తో టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్ కొట్టాడో, దాన్ని ‘కబీర్‌‌సింగ్‌’గా బాలీవుడ్‌లో రీమేక్ చేసి అంతే సక్సెస్ అయ్యాడు సందీప్. తన నెక్స్ట్ సినిమాని కూడా హిందీలోనే కమిటయ్యాడు. రణ్‌బీర్ కపూర్‌‌తో ‘యానిమల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో ప్యాన్ ఇండియా మూవీని సెట్‌ చేసుకోవడం సెన్సేషన్ సృష్టిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలకు బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాడు. వాటిలో ఒకట్రెండు పూర్తయ్యాక ‘స్పిరిట్‌’ని సెట్స్కి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.