పోస్టల్ బ్యాలెట్.. ప్రకాష్ రాజ్ వాదనేంటి?


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తగ్గని రీతిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండగా.. ఇటు ప్రకాష్ రాజ్, అటు మంచు విష్ణు ప్యానెళ్ల వారు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని అంటుండగా.. మంచు విష్ణు బ్యాలెట్ కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్.. బ్యాలెట్ విషయంలో అభ్యంతరాలు చెబుతుండటానికి కారణాలు లేకపోలేదు.

ఈ విషయంలో మంచు విష్ణు ప్యానెల్ అడ్వాంటేజ్ తీసుకుని అక్రమాలకు పాల్పడుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ముందు తాను కూడా మద్దతు పలికానని.. ఐతే ఈ విషయంలో మంచు విష్ణు ప్యానెల్ నిబంధనలను అతిక్రమిస్తోందని ఆయన ఆరోపించారు.

నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకున్న వాళ్లు.. ఇందుకు క్లారిఫికేషన్ ఇస్తూ ‘మా’ రిటర్నింగ్ అధికారికి లేఖ రాయాలని.. అలాగే పోస్టల్ బ్యాలెట్ కోసం రూ.500 రుసుము చెల్లించాలని.. ఐతే చెన్నైలో ఉన్న కొందరు సభ్యుల కోసం తాను ఫోన్ చేస్తే అప్పటికే మంచు విష్ణు తరఫు వాళ్లు తమ దగ్గర లేఖ తీసుకెళ్లారని చెప్పారని.. ఇలా 50 మంది కంటే ఎక్కువమంది దగ్గర లేఖలు తెప్పించుకుని మంచు విష్ణు తరఫు వాళ్లే ఒకేసారి అందరి డబ్బులు కట్టేశారని.. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ పంపించినా సభ్యుల ప్రమేయం లేకుండా వీళ్లే తమకు ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకుంటారని.. ఇది ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.

కృష్ణం రాజు, శారద, పరుచూరి సోదరులు.. ఇలా చాలామంది ఓట్లను ఇలా తమకు వేసుకునేలా ప్లాన్ చేశారని.. కృష్ణం రాజుకు సంబంధించిన డబ్బులు మంచు విష్ణు కట్టడం ఏంటని చాలా ఉద్వేగంగా, కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. మరి ఈ ఆరోపణలపై విష్ణు అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.