నరేష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు-ప్రకాష్ రాజ్


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ముంగిట సినీ రాజకీయం వేడెక్కుతోంది. బరిలో ఉన్న రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇటీవల సినీ పరిశ్రమ కోసమని ‘రిపబ్లిక్’ ఈవెంట్లో పవన్ చేసిన వ్యాఖ్యలను మంచు విష్ణు తప్పుబట్టడం.. ఆయన వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం.. ఆపై ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “పవన్ ఎవరని అడుగుతారా? ఆయన సినిమా మార్నింగ్ షో వసూళ్లంత ఉండవు మీ సినిమా బడ్జెట్లు” అంటూ విరుచుకుపడటం తెలిసిందే.

ఆ తర్వాత మంచు విష్ణుకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రస్తుత అధ్యక్షుడు నరేష్.. ప్రకాష్ రాజ్ మీద విమర్శలు గుప్పించారు. దీనిపై ఇప్పుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. నరేష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు.

“నరేష్ అహంకారి. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే మంచిది. మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారు. నన్ను తెలుగువాడు కాదని నరేష్‌ అన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికీ రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. ‘మా’ కొసం ఒక బాధ్యతతో పనిచేయాలని వచ్చాను” అని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇక చిరంజీవి సహా సినీ పెద్దల మద్దతు ప్రకాష్ రాజ్‌కు ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పెద్దల ఆశీర్వాదం అక్కర్లేదని అనేశారు. “పెద్దల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తా పై గెలుస్తా. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి. పెద్దల దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే ‘మా’కు తాళం పడేది. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసు” అని ఆయనన్నారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నరేష్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.