త‌మిళ బిగ్ బాస్‌లో తెలుగ‌మ్మాయి

తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ మొదలై కొన్ని వారాలు గడిచింది. షో ఆసక్తికరంగానే సాగుతున్నట్లుగా ఫీడ్ బ్యాక్ వస్తోంది. తెలుగుతో పాటే ఒకే ఏడాది మొదలైన తమిళ బిగ్ బాస్.. ప్రతి సీజన్లోనూ కొన్ని వారాలు ఆలస్యంగా మొదలవుతోంది. ఈసారి కూడా తెలుగు షో మొదలైన నెల రోజులకు తమిళ బిగ్ బాస్ శ్రీకారం చుట్టుకుంది. ఆదివారం కర్టెన్ రైజర్ ప్రసారమైంది. తెలుగులో మాదిరే తమిళంలోనూ ఈసారి జంబో జట్టునే హౌస్‌లోకి దించారు. మొత్తం 18 మంది పార్టిసిపెంట్లకు ఈసారి అవకాశం దక్కింది. అందులో ఒక తెలుగమ్మాయి కూడా ఉండటం విశేషం. ఆ అమ్మాయే.. పావని రెడ్డి.

ఈ పేరు చూస్తేనే తను తెలుగమ్మాయి అనే విషయం అర్థమైపోతుంది. తెలుగులో సీరియల్స్‌, సినిమాల్లో పావని నటించింది. కాకపోతే అవి మరీ పేరున్నవి కావు. తెలుగులో ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ అనే చిన్న సినిమాల్లో నటించింది. అలాగే అగ్నిపూలు, నా పేరు మీనాక్షి, నేను ఆయన ఆరుగురు అత్తలు అనే సీరియళ్లు కూడా చేసింది.

ఐతే ఇక్కడ అంతగా పాపులర్ కాకపోవడంతో తమిళంలోకి వెళ్లిపోయిన పావని.. చెప్పుకోదగ్గ అవకాశాలే వచ్చాయి. టీవీ సీరియళ్లు, షోలతో పాటు సినిమాల్లోనూ చెప్పుకోదగ్గ పాత్రలు చేసింది.

పావని పేరు నాలుగేళ్ల కిందట మీడియాలో బాగా నానింది. ఆమె భర్త అయిన తెలుగు టీవీ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాతే ఆమె తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయి చెన్నైలోనే సెటిలైపోయింది. తమిళం నేర్చుకుని తమిళ సీరియళ్లు, సినిమాలతో కొంచెం బిజీ అయిన పావనికి అక్కడ మంచి పాపులారిటీనే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్‌లో అడుగు పెడుతున్న పావని.. హౌస్‌లో ఎలాంటి పేరు సంపాదించి, తమిళ ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో చూడాలి.