ఎంఎల్ఏలను మార్చకపోతే కష్టమేనా ?

తాజాగా వెల్లడైన ఓ సర్వే రిపోర్టు ప్రకారం అధికార వైసీపీలో కొంతమంది ఎంఎల్ఏలను మార్చకపోతే గెలుపు కష్టమే. ఆత్మసాక్షి అనే గ్రూపు కోసమని ఐఐటి విద్యార్ధులు ఏపిలో ఓ సర్వే చేశారు. మార్చి-సెప్టెంబర్ మధ్య జరిగిన సర్వేలో 13 జిల్లాల్లోని 68,200 మందిని టచ్ చేశారు. ఈ సర్వే ఫలితాలు అధికారపార్టీకి వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. కాబట్టి సర్వే ఫలితాలను బట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు చంద్రబాబునాయుడు కూడా అలర్టవ్వాల్సిందే.

ఇంతకీ విషయం ఏమిటంటే సర్వే ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో ఓవరాల్ గా మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే కొందరు ఎంఎల్ఏలు, ఎంపీల పనితీరు మీద తీవ్రమైన అసంతృప్తి కనబడింది. అలాగే 11 మంది మంత్రుల పనితీరులో కూడా జనాలు మైనస్ మార్కులే ఇఛ్చారు. వైసీపీలోని 151 మంది ఎంఎల్ఏల్లో 66 మందిపై జనాల్లో అసంతృప్తి ఉన్నట్లు తేలింది. వీరిలో కూడా 46 మంది ఎంఎల్ఏల పనితీరైతే మరీ పూరుగా ఉందట.

పనితీరు మరీ పూరుగా ఉన్న 46 మంది ఎంఎల్ఏలకు జనాలు 27-35 మార్కులనే ఇచ్చారు. అంటే వీళ్ళల్లో అత్యధికులక కనీసం పాస్ మార్కులు కూడా ఇవ్వలేదంటే పరిస్దితిని అర్ధం చేసుకోవచ్చు. అలాగే 22 మంది ఎంపిల్లో 8 మంది పనితీరుపై జనాల్లో తీవ్ర అసంతృప్తి బయటపడింది. మంత్రుల విషయానికి వస్తే అనీల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, శంకరనారాయణ, గుమ్మనూరు జయరామ్, తానేటి వనిత, శ్రీరంగనాధరాజు, ధర్మాన కృష్ణదాస్, పినిపే విశ్వరూప్, అవంతి శ్రీనివాస్ పై జనాలు సంతృప్తిగా లేరు.

మంత్రులుగానే కాకుండా ఎంఎల్ఏలుగా కూడా పై 11 మంది ఫెయిల్ అయినట్లు జనాలు అనుకుంటున్నారట. నియోజకవర్గాల్లో వీళ్ళకు అసలు పట్టేలేదని జనాలు అభిప్రాయపడుతున్నారు. సరే వైసీపీ ప్రజాప్రతినిధులపైన జనాల్లో అసంతృప్తి ఉండటం సహజమే అనుకుందాం. మరి ప్రతిపక్షం టీడీపీ సంగతేమిటి ? చంద్రబాబునాయడుతో సహా మొత్తం 23 మంది ఎంఎల్ఏల పనితీరుపై జనాల్లో బాగా అసంతృప్తి పేరుకుపోయిందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబుతో సహా ఎంతమంది గెలుస్తారనేది డౌటేనట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంగా వైసీపీపైన జగన్మోహన్ రెడ్డిపైన జనాల సానుకూలంగా ఉన్నారు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా సమయం ఉందికాబట్టి ఎంఎల్ఏలు తమ పనితీరు మెరుగుపరుచుకుంటే బాగానే ఉంటుంది. లేకపోతే కష్టమే. అయితే పనితీరు మెరుగు పరుచుకునే అవకాశం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి పనితీరు ఆధారంగా జగన్ ఎంఎల్ఏలను మార్చకపోతే మాత్రం ఓటమి తప్పదని గ్రహించాలి.