బాలు నోట.. ‘అన్నాత్తే’ పాట

కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పాట అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే. కానీ కరోనా ఆయన్ని సడెన్‌గా తీసుకుపోయింది. ఎన్నో యేళ్లుగా అలరించిన ఆ మధుర స్వరం మూగబోయింది. బాలు అందరినీ వదిలి వెళ్లిపోయి అప్పుడే ఏడాది దాటేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఆయన పాట అందరి వీనులకూ విందు చేయబోతోంది. రజినీకాంత్ సినిమా ద్వారా.

శౌర్యం, వీరమ్, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు తీసిన శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తే’ మూవీ చేస్తున్నారు రజినీకాంత్. ఆయన సినిమా అంటే ఎంట్రీ సాంగ్ కామన్. ప్రతి సినిమాలోనూ రజినీ కోసం అదిరిపోయే ఎంట్రీ సాంగ్‌ని పనిగట్టుకుని పెడతారు డైరెక్టర్స్. వాటిని చాలా యేళ్లుగా బాలుయే పాడుతూ వచ్చారు. ‘అన్నాత్తే’ కోసం కూడా ఆయనే పాడారు. అయితే ఆ పాట బైటికి రాకముందే బాలు కన్నుమూశారు.

ఇప్పుడు ఆ పాటను రిలీజ్ చేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌‌ 4న సాయంత్రం ఆరింటికి సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. డి.ఇమ్మాన్ కంపోజ్ చేసిన ఈ పాట గత చిత్రాల్లోని రజినీ ఎంట్రీ సాంగ్స్‌ను మించి ఉంటుందంటున్నారు.

ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా లాంటి పాపులర్ స్టార్స్ చాలామంది ఇందులో నటించారు. రజినీ ఊరిపెద్దగా.. కీర్తి సురేష్ ఆయనకి కూతురిగా.. ఖుష్బూ, మీనా రజినీకి చెల్లెళ్లుగా కనిపిస్తారట. అన్నాచెల్లెళ్ల రిలేషన్‌ బేస్డ్‌గా సినిమా ఉంటుందని, అందుకే ‘అన్నాత్తే’ అని టైటిల్‌ ఫిక్స్ చేశారని సమాచారం. తెలుగులో ఏ పేరుతో రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.