పాదయాత్రతో బండి ఏం సాధించారు ?

Bandi Sanjay
Bandi Sanjay

బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ పాదయాత్రతో ఏమి సాధించారో అర్ధం కావటంలేదు. మామూలుగా ఎవరైనా పాదయాత్ర చేశారంటే ప్రజల బాధలు వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు, పరిష్కార మార్గాలు చర్చించేందుకే. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కారిస్తామని భరోసా ఇవ్వటం మామూలే. గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసిందిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారనేది వేరే విషయం.

అయితే తాజాగా బండి సంజయ్ చేసిన 36 రోజల 438 కిలోమీటర్ల పాదయాత్ర మొదటిదశ ఈరోజు ముగుస్తోంది. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ముగింపుసభ జరగబోతోంది. బండి పాదయాత్ర 8 జిల్లాలు, 6 లోక్ సభ నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. రెండోదశ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. సరే ఎప్పుడు చేసినా, ఎప్పుడు ముగించినా ఒకటే అనే అభిప్రాయం జనాల్లో ఉంది.

ఎందుకంటే బండి పాదయాత్ర కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు రాష్ట్రాన్ని కేసీయార్ అధంకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బండి కేంద్రంనుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టడంలో మాత్రం ఫెయిలవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ ఏ విధంగా దెబ్బకొడుతుందో మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఉదాహరణలతో సహా చెబుతున్నారు.

హనుమకొండకు శాంక్షన్ అయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తర్వాత మహారాష్ట్రకు తరలిపోయింది. రాష్ట్రంలో రైల్వేలైన్ల ఏర్పాటు నత్తనడక నడుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణాకు అప్పటి యూపీఏ ప్రభుత్వం కేటాయించిన ఐటిఐఆర్ సంస్ధ ఏమైందో కూడా తెలీదు. ఇలాంటి అనేక హామీలను కేంద్రం ఒకవైపు తుంగలో తొక్కుతుంటే మరోవైపు బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర చేసినందు వల్ల ఉపయోగం ఏమిటో అర్ధం కావటంలేదు.

కేంద్రం నుండి తెలంగాణాకు రావాల్సిన ప్రయోజనాలు, నిధులను రాబడుతుంటే బండి సజయ్ పాదయాత్రక జనాల మద్దతు లభిస్తుంది. అలా కాకుండా కేంద్రం నుండి తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటం మానేసి ఎంతసేపు కేసీయార్ ను మాత్రమే టార్గెట్ చేస్తామంటే జనాలు అంగీకరించరని కమలనాదులు గ్రహించాలి.