బ‌ద్వేల్ మ‌న‌దే.. జ‌గ‌న్ వ్యూహం.. ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్ కు సంబంధించిన ఉప ఎన్నిక షె డ్యూల్ వ‌చ్చేసింది. అక్టోబ‌రు 1 నుంచి(శుక్ర‌వారం) నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభం కానుంది. అదేనెల 30న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి అధికార, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. వైసీపీ, టీడీపీలు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. ఇక‌, ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్.. వ్యూహం కూడా రెడీ చేసుకున్నారు. తాజాగా ఆయ‌న బ‌ద్వేల్‌లో వైసీపీ విజ‌య భేరీ ఎలా మోగించాల‌నే విష‌యంపై నాయ‌కుల‌కు దిశానిర్దేశం… చేశారు. ఎవ‌రినీ నొప్పించ‌కుండానే.. ఆయ‌న ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ రెడీ చేయ‌డం గ‌మ‌నార్హం.

బద్వేల్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కడపలో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావ‌డంతో ఇక్క‌డ నుంచి తిరిగి ఆయ‌న స‌తీమ‌ణి సుధ‌కు టికెట్ ఇస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా.. ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించే అంశంపై జ‌గ‌న్‌.. పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. బద్వేలు ఉప ఎన్నికపై సీఎం క్యాంప్ కార్యాలయంలో స‌మావేశం నిర్వ‌హించారు. అభ్య‌ర్థి సుధ‌తోపాటు.. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి.. త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించాల్సిన బాధ్య‌త అందరిమీదా ఉంద‌న్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని సూచించారు. 2019లో దాదాపు 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చింద‌న్న జ‌గ‌న్‌.. దానికి మించిన మెజారిటీ డాక్టర్‌ సుధకు రావాల‌ని నిర్దేశించారు. అదేస‌మ‌యంలో నేత‌ల‌కు ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని సూచించారు. కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలన్నారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని.. ఇప్పుడు ఇది పెరిగేలా నాయ‌కులు కృషి చేయాల‌న్నారు. ఓటింగ్‌ శాతం పెరగాలని, ఓటర్లను ప్రోత్సహించాల‌ని తెలిపారు.

“ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలి. గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలి. ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. వారిని అభ్యర్థించాలి. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా ప్ర‌జ‌ల‌ను చైతన్యం చేయాలి. నెల రోజులపాటు మీ సమయాన్ని కేటాయించి, ఎన్నికపై దృష్టిపెట్టాలి. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియ‌మిస్తున్నాం. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలి” అని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. సో. మొత్తానికి సీఎం.. చెప్ప‌క‌నే త‌న ల‌క్ష్యం చెప్ప‌డం.. నాయ‌కుల‌కు సైలెంట్ వార్నింగ్ ఇవ్వ‌డం.. జ‌రిగిపోయింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.