పవన్‌పై దాడి.. ఎవరూ మాట్లాడరా?

మొన్న ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్.. సినిమా పరిశ్రమ మంచి కోసమే గళం విప్పారు. తనను టార్గెట్ చేసే క్రమంలో కొన్ని నెలల నుంచి టాలీవుడ్ వ్యతిరేక నిర్ణయాలతో మొత్తం సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ వ్యాఖ్యలు.. ఆయన ప్రశ్నలు సహేతుకమైనవే అన్నది మెజారిటీ అభిప్రాయం.

ఈ నేపథ్యంలో పవన్‌కు మద్దతుగా ఇండస్ట్రీ నుంచి గళాలు వినిపిస్తాయని అనుకుంటే.. నాని, కార్తికేయ, సంపూర్ణేష్ బాబు లాంటి ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే ఎవరూ మాట్లాడలేదు. ఐతే సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో పవన్‌ను వెనకేసుకు రావడం ద్వారా.. లేదంటే ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని చాలామంది భావించి ఉండొచ్చు. పవన్ వ్యాఖ్యల్లో రాజకీయ కోణం ఉండటంతో ఈ వివాదంలో వేలు పెట్టి తాము ఇబ్బంది పడటం ఎందుకు అనుకుని ఉండొచ్చు. ఆ సంగతి వదిలేద్దాం.

కానీ తాజాగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు మాత్రం దారుణం. పవన్ భార్యా పిల్లల్ని వివాదంలోకి లాగి దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేశారు పోసాని. పవన్ ఒక రాజకీయ నాయకుడు అన్నది పక్కన పెడితే.. సినిమా పరిశ్రమ వ్యక్తి. ఒక సహ నటుడి గురించి పోసాని ఇంత దిగజారి మాట్లాడటం ఎంతమాత్రం సహేతుకం కాదు. ఏ రకంగానూ ఈ వ్యాఖ్యల్ని సమర్థించుకోవడానికి వీల్లేదు. మరి ఈ వ్యాఖ్యల్ని ఖండించడానికి సినీ జనాలకు ఏం ఇబ్బందన్నది అర్థం కాని విషయం.

ఎవరో అభిమానులు తనను, తన భార్యను తిడితే దానికి పవన్‌ను బాధ్యుణ్ని చేసి బూతులు తిట్టడం.. భార్య, బిడ్డ గురించి అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్? ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తే అది రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్లు కాదు. ప్రభుత్వంతో అసలేమాత్రం సంబంధం లేని విషయమిది. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో కూడా పవన్‌కు మద్దతుగా పరిశ్రమ నిలవకపోవడం, పోసాని వ్యాఖ్యల్ని ఖండించకపోవడం ఏమిటో అర్థం కాని విషయం. ఇది చూసి సినీ జనాలు మరీ ఇంత పిరికి వాళ్లా అని జనం ఆశ్చర్యపోతుండటంలో ఆశ్చర్యమేముంది?