జగన్ కి కాపు సేన వార్నింగ్

పోసాని ప్రెస్మీట్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. జగన్ అభిమాని అని బహిరంగంగా చెప్పుకున్న పోసాని జగన్ కి సాయం చేయబోయి గట్టిగానే ఇరికించినట్టు తదనంతర పరిణామాల ద్వారా అర్థమవుతోంది.

పవన్ అభిమానులు తిట్టారు అనే నెపంతో వాళ్లు తిట్టిన తిట్లన్నీ పవన్ కళ్యాణ్ ని తిడుతూ మీడియా సమావేశం పెట్టారు పోసాని. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ మాట్లాడిన పోసాని మురళిపై జనసేన పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పవన్ ను అవమానించారంటూ పంజాగుట్ట పీఎస్ లో పోసాని పై జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఫిర్యాదు చేశారు. అయితే, సాయంత్రం ప్రెస్ మీట్ అనంతరం తనకేం అయినా పవన్ దే బాధ్యత అని, రేపు పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని పోసాని చెప్పిన విషయం తెలిసిందే.

ఇక పవన్ పై వైసీపీ నాయకుల వరుస మాటల దాడితో కాపు సంక్షేమ సేన తీవ్రంగా స్పందించింది. జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్‌పై వైసీపీ నేతల విమర్శలపై కాపు సంక్షేమ సేన లేఖ విడుదల చేసింది. కాపు మంత్రులు పవన్‌ను తిట్టడం వెనుక జగన్‌ హస్తం ఉందని కాపు సంక్షేమ సేన లేఖలో ఆరోపించింది. పవన్‌ను అవమానించడమంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమే అని పేర్కొంది. 2024 ఎన్నికల్లో వీటి పర్యవసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని కాపు సంక్షేమ సేన జగన్ కి వార్నింగ్ ఇచ్చింది.