నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు

‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా వైసీపీ నేతలపై ఓ రేంజ్లో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యల ప్రకంపనలు.. ఏపీ అధికారపార్టీ నేతలంతా ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిట్ల దండకాన్ని మొదలు పెట్టారు. సన్నాసి అంటూ మంత్రి పేర్ని నానిపై ఫైర్ అయిన పవన్ ను.. మంత్రులు పలువురు అంతే ఘాటుగా రియాక్టు అయ్యారు. శనివారం రాత్రి పవన్ విమర్శల ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. దానికి ప్రతిస్పందనలు పెద్ద ఎత్తున ఆదివారం మొత్తం సాగాయి.

ఇలాంటి వేళ.. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ సర్కారులోని డొల్లతనాన్ని ఎత్తి చూపేలా పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. ‘ప్రజల మీద పన్నులు రుద్ది.. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు. సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవరత్నాలు’ భావితరాలకు ‘నవకష్టాలు’ అంటూ వైసీపీ సర్కారు తీరును తప్పు పట్టారు.

ఏదో ట్వీట్ చేశామంటే చేశామన్నట్లు కాకుండా.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. చేస్తున్న పనులు అంటూ ఒక లిస్టును తన ట్వీట్ కు జత చేశారు. అందులో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చర్యలుగా ఏమేం చేస్తున్నారన్న వాదనను తెలిపేలా పోస్టు ఉంది.

మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని.. నియంత్రిస్తామని చెప్పి.. మద్యంతో వచ్చే ఆదాయాల్ని సెక్యురిటీగా చూపించి రుణాలు తీసుకుంటున్నారన్నారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. ఛార్జీల భారాన్ని మోపారన్నారు. ప్రతి ఏటా 6500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇంతకాలానికి కేవలం 450 పోస్టుల్ని మాత్రమే భర్తీ చేశారన్నారు. గ్రూప్ 1-2 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు కేవలం 36 మాత్రమే భర్తీ చేశారన్నారు. ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయలేదన్నారు.

అక్రమ మైనింగ్ మీద ఉక్కుపాదం మోపుతామని.. ఇసుక ధరల్ని తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇసుక తవ్వకాల్ని ప్రైవేటుకు కట్టబెట్టారన్నారు. పారదర్శక పాలనను మెరుగుపరుస్తామని చెప్పిన ప్రభుత్వం.. చివరకు జీవోల్ని పబ్లిష్ చేసే వెబ్ సైట్ ను నిలిపేశారు. బలమైన రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పి.. అసలు రాజధానే లేకుండా చేశారు. కన్ఫ్యూజన్.. కోర్టులు.. కేసులతో సరిపెడుతున్నారంటూ ట్వీట్ లో విమర్శల్ని గుప్పించారు.