సుప్రీంకోర్టు మెయిల్ నుంచి మోడీ ఫొటో డిలీట్

ప్ర‌చారం.. మీడియా క‌వ‌రేజ్ అంటే.. ఏ నాయ‌కుడికి మాత్రం ఇష్టం ఉండ‌దు. అస‌లు ఇప్పుడున్న నాయ కులు కోరుకునేదే.. ప్ర‌చారం. చేసేది ఎంత? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌చార‌మే ప‌ర‌మావ‌ధిగా ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. ఇక‌, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యాన్నే తీసుకుంటే.. ఆయ‌న కున్న ప్ర‌చార యావ ఎవ‌రికీ లేద‌ని చెబుతారు. ఇప్ప‌టికే ప్ర‌సార భార‌తి ఆధ్వ‌ర్యంలోనే దూర‌ద‌ర్శ‌న్ అన్ని కేంద్రాలూ.. మోడీకి ప్ర‌చార వ‌స్తువుగా మారిపోయాయి. అదే స‌మ‌యంలో కొన్ని మీడియా వ‌ర్గాలు కూడా ఆయ‌న చెప్పిన‌ట్టే న‌డుస్తున్నాయి. ఏం చేసినా.. ప్ర‌చారానికి.. ప్ర‌క‌ట‌న‌ల‌కు.. మోడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే.. మోడీ ప్ర‌చార యావ‌కు.. దేశ అత్యున్న‌త న్యాయ స్థానం.. సుప్రీం కోర్టు బ్రేకులు వేసింది. మోడీ త‌న ప్ర‌చారాన్ని సుప్రీం కోర్టు వ‌ర‌కు పాకించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. దీంతో వెంట‌నే మోడీకి షాకిస్తూ.. సుప్రీం కోర్టు పాల‌నాధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని అజాదీకా అమృత్ మ‌హోత్సవాన్ని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో మోడీ ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్‌సైట్లు, ఈ-మెయిల్స్‌, అన్నిటా.. కూడా ‘సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ నినాదంతో పాటు మోడీ ఫోటోతో కూడిన ప్రచారం షార్ట్ ఫిల్మ్‌ను ఉంచుతున్నారు.

అయితే.. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ కింద భాగంలో కూడా మోడీ ప్ర‌చార చిత్రాన్ని ఉంచారు. ఈ విషయాన్ని కొందరు లాయర్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దృష్టికి తీసుకు వెళ్లడంతో రిజిస్ట్రీ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది.

న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్‌ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తొలగించాలని ఎన్‌ఐసీని ఆదేశించింది. దీనిపై తక్షణ చర్యలకు దిగిన ఎన్‌ఐసీ.. సుప్రీంకోర్టు ఈ-మెయిల్ కింద భాగంలోని మోడీ ప్రచార చిత్రాన్ని తొలగించింది. అంతేకాదు.. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మోడీ ఫోటో స్థానంలో విద్యుత్ వెలుగుల్లో ఉన్న సుప్రీంకోర్టు భవనం ఫోటోను పెట్ట‌డం గ‌మ‌నార్హం.