ఎన్నికల్లో పోటీ చేయను.. కానీ టీడీపీలో కొనసాగుతా.. నాని!

టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేరనే చర్చ బెజవాడలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇదే విషయాన్ని చెప్పారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు ఆయన కుమార్తె శ్వేత కూడా ఎన్నికల్లో పోటీ చేయబోమని అధినేతకు చెప్పారట. ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీకి దూరంగా ఉంటానని అనుకోవద్దని, పార్టీతోనే కొనసాగుతానని చెప్పారని సమాచారం. ఇప్పటికే తన కుమార్తె శ్వేత టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో వేరే అభ్యర్థిని చూసుకోవాలని అధినేతకు చెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు ముందు మరో డిమాండ్ కూడా ఆయన పెట్టారని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబును నాని కోరారని ఆ వర్గాలు చెబుతున్నాయి. నెల రోజుల కిందట చంద్రబాబుతో నాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశంలోని తన నిర్ణయాన్ని వెల్లడించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యాలయంలో ఉన్న సమయంలో కూడా ఆయన అటువైపు రాలేదని చెబుతున్నారు.

టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నాని అసంతృప్తికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వివాదం.. ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. బెజవాడ ఎన్నికల సమయంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. కేశినేని, స్థానిక నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, బొండా ఉమ తదితరులకు నడుమ దూరం పెరిగింది. దూరం పెరగమే కాదు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు కూడా చేసున్నారు.

బెజవాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజవాడకు తానే బాస్ అన్నట్టుగా.. తానే విజయవాడకు అధిష్టానమని, రాష్ట్రానికి చంద్రబాబు అధిష్టానమని కేశినేని చెప్పారు. కేశినేని వ్యాఖ్యలతో బుద్దా వెంకన్న మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబును కేశినేని ఏక వచనంతో సంబోధించడాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను పిలిపించుకుని నేతల మధ్య సయోధ్య కుదిర్చారని టీడీపీ నేతలు చెప్పారు.

అప్పటి నుంచి ఆయన పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని తన అనుచరుల ముందు నాని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎంపీగా మాత్రం అధికారిక కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో టీడీపీ నుంచి ఎంపీలుగా కేశినేని నాని (విజయవాడ) గల్లా జయదేవ్ (గుంటూరు) రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం) గెలిచారు. అయితే పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మెహన్ నాయుడును చంద్రబాబు నియమించారు. అయితే ఈ పదవిపై కేశినేని అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కేశినేని నాని ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎప్పుడూ చెప్పని ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా పోటీ చేయబోనని ప్రకటించడం చూస్తుంటే ఆయన వేరే ‘ఉద్దేశం’తో ఉన్నారన్నది స్పష్టంగా అర్థమవుతోందని అంతర్గతంగా నేతలు చెప్పుకుంటున్నారు.