మోడికి సుప్రింకోర్టు పెద్ద షాక్

ప్రధానమంత్రి నరేంద్రమోడికి సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. కేంద్రం సమ్మతితో పనిలేకుండానే పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై వారం రోజుల్లో నిపుణుల కమిటిని వేయబోతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించటం కేంద్రప్రభుత్వం+బీజేపీలో సంచలనంగా మారింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందనే ఆరోపణలు దేశంలో ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. దీనిపై కొందరు వేసిన పిటీషన్లను సుప్రింకోర్టు విచారిస్తోంది.

విచారణ సందర్భంగా సుప్రింకోర్టుకు కేంద్రం పెద్దగా సహకరించటంలేదు. ఎప్పుడు విచారణ జరిగినా పెగాసస్ సాఫ్ట్ వేర్ తో ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేసిందా లేదా చెప్పమని స్వయంగా చీఫ్ జస్టిస్ ప్రశ్నించినా సమాధానం చెప్పటానికి సొలిసిటర్ జనరల్ నిరాకరించారు. ట్యాపింగ్ అంశంపై వివరమైన అఫిడవిట్ దాఖలు చేయమని అడిగినా కేంద్రం తరపున ఒక్కసారి కూడా అఫిడవిట్ దాఖలు కాలేదు. దాంతో కేంద్రం వైఖరిపై విసిగిపోయిన చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ పెగాసస్ విషయంలో సుప్రింకోర్టే ఏదో నిర్ణయం తీసుకుంటుందని గట్టిగానే హెచ్చరించారు.

చీఫ్ జస్టిస్ ఎంత హెచ్చరించినా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై తేల్చని కేంద్రం అసలు ఈ విషయమై సుప్రింకోర్టులో విచారణే జరగకూడదని వాదించింది. దేశభ్రదతకు సంబంధించిన విషయాలపై కోర్టులో విచారణ ఎలా చేస్తారంటు ఎదురు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ నే ప్రశ్నించింది. దీంతోనే అందరికీ అర్ధమైపోయింది పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం ఉపయోగించిందని. కాకపోతే అదే విషయాన్ని కేంద్రం ముఖతా వినాలని చీఫ్ జస్టిస్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.

కేంద్రం సహకరించని నేపధ్యంలో ఎన్నిరోజులు విచారించినా ఉపయోగం ఉండదని సుప్రింకోర్టుకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే తనంతట తానుగా ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయటానికి ఓ నిపుణుల కమిటీని వేయాలని డిసైడ్ అయిపోయింది. నిజానికి ఆ కమిటీని ఈ వారంలోనే నియమించాలని అనుకున్నా సాధ్యంకాలేదు. ఎందుకంటే కమిటీలో ఉండటానికి నిపుణులను ఎంపికచేస్తే అందులో కొందరు కమిటీలో ఉండటానికి నిరాకరించారట.

దాంతో కమిటీలో కొత్త సభ్యులను ఎంపిక చేయాల్సొచ్చింది. ఈ విషయన్ని కూడా ఎన్వీ రమణే చెప్పారు. నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు కాబట్టి తొందరలోనే కమిటిని వేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు నియమిస్తున్న కమిటి కాబట్టి దాని రిపోర్టు కూడా సుప్రింకోర్టుకే సమర్పించాలి. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వంలోని ఎవరిని కమిటి ముందుకు వచ్చి వివరాలు చెప్పమని కమిటీ అడిగినా నిరాకరించేందుకు లేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంలో కేంద్ర హోంశాఖ, ఐటీ, విదేశీ వ్యవహారాల శాఖలకు భాగస్వామ్యం ఉందని అనుకుంటున్నారు. కాబట్టి తొందరలోనే విచారణను ముగించి సుప్రింకోర్టు మోడికి గట్టి షాకే ఇచ్చేట్లుంది.