‘అన్నదాతను ఉరికంభమెక్కిస్తున్నారు.. ‘

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా రైతుల‌ను ఆదుకోవ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని విమ‌ర్శ‌లు గుప్పించారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ పార్టీ తెలుగు రైతు విభాగం నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న హయాంలో వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అన్నివిధాలా అండగా నిలిచామని చెప్పారు.

మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే..

“గత 28నెలల ఏపీ ప్ర‌భుత్వ పాలనలో వ్యవసాయం రంగం సంక్షోభంలో పడింది, ప్రభుత్వం నుంచి సాయం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు భరోసా రూ.12,500 ఇస్తానని చెప్పి కేవలం రూ.7500 మాత్రమే ఇచ్చి రైతులను మోసగించారు, 5వ విడత రుణమాపీ సొమ్ము ఎగ్గొట్టారు” అన్నారు. టీడీపీ హయాంలో అమరావతి, పోలవరం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందకు నడిపించాం, మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరంతోపాటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తయ్యేదని తెలిపారు. జగన్ వచ్చాక అమరావతితో పాటు పోలవరాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

64 వేల కోట్లు ఖ‌ర్చు చేశాం..

టీడీపీ అయిదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి రంగంపైనే 64 వేల కోట్లు ఖర్చు చేశామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. పట్టిసీమ ద్వారా నధుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. తద్వారా రాయలసీమకు నీరందించామ‌న్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ది చేశామని చంద్రబాబు అన్నారు. దేశం మొత్తమ్మీద వ్యవసాయంరంగంలో రెండంకెల వృద్ది సాధించిన ఘనత త‌మ‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతులకు మద్దతు ధర ఇచ్చామ‌న్నారు. వరదలు, తుపాన్లు, ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నామ‌ని చెప్పారు. శనగ, పామాయిల్, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి న్యాయం చేశామని తెలిపారు.

రాష్ట్రాన్ని ఒడ్డున ప‌డేశాం.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉంద‌ని.. అలాంటి రాష్ట్రాన్ని ఒడ్డున ప‌డేశామ‌ని.. చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా.. రైతులకు ఇఛ్చిన హామీ ప్రకారం రైతులకు రుణ మాఫీ అమలుచేశామని చెప్పారు. రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, యంత్ర పరికరాలు, డ్రిప్స్ అందించామ‌న్నారు. టీడీపీ హయాంలో రైతులకు అన్ని విధాలా న్యాయం చేశామని చంద్ర‌బాబు తెలిపారు.

పార్టీ ప‌టిష్ఠంగా ఉంది!

ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలుగు రైతు నేతలకు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తల్ని ఆర్దికంగా ఇబ్బందులకు గురిచేసినా, భౌతిక దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా సరే ఒక్కరు కూడా పార్టీని వీడలేదని అన్నారు. పార్టీ ప‌టిష్ఠంగా ఉంద‌న్నారు. పార్టీ కోసం పనిచేసినవారికి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంద‌న్నారు. పార్టీలోని అన్ని అనుబంద విభాగాలు సమన్వయంతో ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. రాష్ర్టం బాగుపడాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

సీఎం, డీజీపీ స‌మాధానం చెప్పాలి!

“వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కెళ్లింది, అభివృద్ధి లేదు, ఉపాథి, పెట్టుబడులు లేవు, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి భావితరాల భవిష్యత్ ని ప్రశ్నార్ధకం చేశారు” అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ర్టంలో జోరుగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోంద‌న్నారు. అఫ్ఘనిస్తాన్ నుంచి వేలకోట్ల డ్రగ్ దిగుమతి అవుతున్నాయ‌ని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఒక టాల్కమ్ పౌడర్ కంపెనీ పేరుతో 21 వేల కోట్లహెరాయిన్ పట్టుబడింద‌ని.. దీనికి ముఖ్యమంత్రి, డిజిపి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యాపారానికి గేట్లు ఎత్తి సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. నాసిరకం మద్యంతో సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను ఆర్థికంగా, శారీరకంగా పీల్చి పిప్పి చేస్తున్నారని అన్నారు.

ప్ర‌జ‌ల‌పై 11 వేల కోట్ల భారం..

టీడీపీ 5 ఏళ్ల పాల‌న‌లో ఏనాడు కరెంట్ చార్జీలు పెంచలేదని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌స్తుతం ట్రూప్ అప్ చార్జీల పేరుతో ప్రజలపై 11వేలకోట్ల భారం మోపారని విమ‌ర్శించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా చెత్తపై పన్నువేసిన ఏకకై చెత్త ప్రభుత్వం ఇదేనని అన్నారు. ఉపాధి ప‌థ‌కం ప‌నుల‌ బిల్లులు చెల్లించకుండా పనులుచేసిన వారిని ఇబ్బందులకు గురిచేస్తే న్యాయ పోరాటం చేశామ‌న్నారు.

కొస‌మెరుపు..

చంద్ర‌బాబు ఇన్ని చెప్పారు బాగానే ఉంది.. కానీ, ఆయ‌న హ‌యాంలో రైతుల‌కు రుణ‌మాఫీని ఎందుకు సంపూర్ణంగా చేయలేక పోయారు..? అదేవిధంగా పెట్టుబ‌డి సాయాన్ని ఎందుకు స‌గం ఇచ్చి స‌గంఆపారు? అలాగే.. కాల్ మ‌నీ కేసులు ఎందుకు వెలుగు చూశాయి.. రైతుల‌ ఆత్మ‌హ‌త్యలు ఎందుకు చోటు చేసుకున్నాయి? వంటి అంశాల‌ను కూడా ప్ర‌స్తావిస్తే.. బాగుండేద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.