చేతులారా రేవంత్ అధిక్యత ప్రదర్శించే ఛాన్స్ ఇచ్చిన కేటీఆర్

మీడియాతో మాట్లాడే సమయంలోనూ.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేటప్పుడు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించటం మంత్రి కేటీఆర్ కు అలవాటు. తాను టార్గెట్ చేస్తే.. ఎదుటోళ్లు ఎంతటి వారైనా సరే డిఫెన్సులో పడిపోవాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. అందుకే.. ఎంత ఆవేశంతో ట్వీట్లు చేసినా.. ఆగ్రహంతో మాట్లాడినా కేటీఆర్ బుక్ కావటం.. సెల్ఫ్ గోల్ చేసుకోవటం లాంటి మాటలు పెద్దగా కనిపించవు.

మొన్నటికి మొన్న సొంత పార్టీ నేత కమ్ రాజ్యసభ సభ్యుడు శశిథరూర్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ నోరు జారటం.. ఆ సందర్భంగా ట్వీట్లు కురిపించిన కేటీఆర్.. రేవంత్ కు ఉచ్చు వేసి మరీ.. అడ్డంగా బుక్ చేయటం తెలిసిందే. కేటీఆర్ తీరును అర్థం చేసుకున్నారేమో కానీ.. తాజాగా రేవంత్ తనదైన రీతిలో కేటీఆర్ బ్యాలెన్సు మిస్ అయ్యేలా చేసి..తప్పుల మీద తప్పులు చేసేలా చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

గడిచిన కొద్ది రోజులుగా సినీ ప్రముఖుల డ్రగ్స్ ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టటం .. ఈ నేపథ్యంలో టీపీసీసీకి చెందిన నేత ఒకరు (రేవంత్ కాదు) మంత్రి కేటీఆర్ కు డ్రగ్స్ టెస్టు చేయాలన్న మాటతో పాటు మరిన్ని ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేయాలంటూ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. నిజానికి ఈ అంశం మీడియాలో పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ పెట్టిన మంత్రి కేటీఆర్.. తాను డ్రగ్స్ టెస్టుకు రెఢీ అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది.

దీంతో మీడియాలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు అమితమైన ప్రాధాన్యత లభించింది. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో టెస్టులకు రెఢీ అన్న మాట వచ్చింది. ఆ వెంటనే స్పందించిన రేవంత్ ఆచితూచి అన్నట్లుగా చాలా తెలివిగా ఎర వేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు వైట్ చాలెంజ్ ను ప్రారంభిస్తున్నానని.. బాధ్యత కలిగిన వారిమిగా.. తాను కూడా టెస్టుకు వస్తానని.. తనతో పాటు మంత్రి కేటీఆర్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిలు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమరవీరుల స్థూపం వద్దకు రావాలన్నారు. డ్రగ్స్ పరీక్షల కోసం తన రక్తం.. వెంట్రుకల నమూనాలు ఇస్తానని చెప్పారు.

రేవంత్ నోటి నుంచి డ్రగ్స్ టెస్టులు.. రాజకీయ సవాలుగా కాకుండా.. సోషల్ మీడియాతో మొదలైన ‘చాలెంజ్’ రూపంలో పిలుపునిస్తూ జాగ్రత్త పడ్డారు. మరీ విషయాన్ని గుర్తించారో లేదో కానీ.. మంత్రి కేటీఆర్ మాటలు మరోలా మొదలయ్యాయి. చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ లాంటి వారితో కాదు కానీ.. రాహుల్ తో మాట్లాడి తీసుకొస్తే తాను పరీక్షలకు సిద్ధమన్న మాటను ఆయన ట్వీట్ రూపంలో చేశారు. అంతేకాదు.. ఓటుకునోటు కేసుకు సంబంధించి రేవంత్ లైడిటెక్టర్ పరీక్షకు రాగలవా? అంటూ సవాలు విసిరారు.

దీనికి బదులుగా స్పందించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్ తనకు వెంట్రుకతో సమానమన్న ఆయన.. తాను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమేనని.. అదే సమయంలో తనతో పాటు..ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలంటూ.. గతంలో గులాబీ బాస్ మీద ఉన్న ఆరోపణల చిట్టాను ప్రస్తావించి.. వాటికి ముఖ్యమంత్రి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఇలా.. ఒకరికి మించి ఒకరికి ట్వీట్లు చేసుకుంటున్న వైనం ఇప్పుడు రాజకీయ వేడిని పెంచింది.. అదే సమయంలో.. రేవంత్ కూల్ గా రియాక్టు అవుతూ.. కేటీఆర్ ను ఎప్పటికప్పుడు టెంప్టు చేసేలా వ్యవహరించటం గమనార్హం.

ఎప్పుడూ తొందరపడి రెచ్చిపోని మంత్రి కేటీఆర్.. తాజా ఎపిసోడ్ లో అనవసరమైన ఆవేశాన్ని ప్రదర్శించారు. తన మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని.. అందుకే కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టబద్ధమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు.. గన్ పార్కు దగ్గరి అమరవీరుల స్తూపం వద్ద జరిగిన సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. వివరణ రూపంలో వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

అయితే.. కేటీఆర్ చెప్పినట్లుగా పరువు నష్టం దావా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు.. తాజా ఎపిసోడ్ లో మంత్రి కేటీఆర్ అనవసరమైన దూకుడు ప్రదర్శించారన్న మాట వినిపిస్తోంది. రాహుల్ ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. సీఎం కేసీఆర్ పై గతంలో వినిపించిన ఆరోపణలు మళ్లీ తెర మీద వచ్చేలా చేయటం కేటీఆర్ వైఫల్యం కాక మరేమిటన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా తాజా ట్వీట్ల కొట్లాటలో కేటీఆర్ మీద రేవంత్ అధిక్యతను ప్రదర్శించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.