ఆ హీరోయిన్ తప్పుకోవడంలో ఆశ్చర్యమేముంది?


మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ కేరళలో రిలీజైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు తీసేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇక అప్పట్నుంచి ఈ సినిమాలో లీడ్ రోల్స్ ఎవరితో చేయించాలనే విషయంలో చాలా సందిగ్ధతే నడిచింది. రకరకాల పేర్లు వినిపించాయి. చివరికేమో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలకు ఖరారయ్యారు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో సందిగ్ధత మొదలైంది. ముందు పవన్‌కు జోడీగా సాయిపల్లవి అన్నారు. తర్వాత ఆమె తప్పుకుంటే నిత్యా మీనన్‌తో ఆ పాత్రను రీప్లేస్ చేశారు.

ఇక రానాకు జోడీగా ముందు వినిపించిన పేర్లు వేరు. చివరికి తమిళ హీరోయిన్ అయిన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ను ఎంచుకున్నారు. ఈమెతో కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు.

ఐశ్వర్య స్థానంలోకి మలయాళ అమ్మాయి సంయుక్త మీనన్‌ను తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది నిజమే కావచ్చు. అసలు ఈ సినిమా చేయడానికి ఐశ్వర్య ఎలా ఒప్పుకుందన్నదే అర్థం కాని విషయం. తమిళంలో కథానాయికగా ఆమెకు మంచి పేరుంది. చాలా వరకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసింది తను. ‘కనా’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ సత్తా చాటింది. అలాంటి అమ్మాయి రానాకు జోడీగా కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రకు ఒప్పుకోవడమే ఆశ్చర్యం.

ఒరిజినల్ చూసిన వాళ్లకు ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థమై ఉంటుంది. చాలా నామమాత్రమైన క్యారెక్టర్ అది. అలాంటి పాత్రను ఐశ్వర్య చేయాల్సిన అవసరమే లేదు. ఐతే ఇందులో నిత్యా మీనన్ చేసిన పాత్రకు ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఓవైపు కెరీర్ చరమాంకంలో ఉన్న నిత్య అలాంటి పాత్ర చేస్తుంటే.. మంచి ఊపులో ఉన్న ఐశ్వర్య ప్రాధాన్యం లేని పాత్ర చేయాల్సిన అవసరమే లేదు. అందుకే కొంచెం లేటుగా అయినా ఐశ్వర్య సరైన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి.