ఆ టీడీపీ సీనియ‌ర్‌కు రెండు సీట్లు కావాల‌ట‌…!

రాయపాటి సాంబశివరావు…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసి, పలుమార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన రాయపాటి ఎన్నో కీల‌క ప‌ద‌వులు అధిరోహించారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయపాటి టి‌డి‌పిలోకి వచ్చేశారు. ఇక 2014 ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలోచ్చేసరికి రాయపాటి మళ్ళీ పోటీలోకి దిగడానికి కొంచెం తటపటాయించారు. తనతో తన కుమారుడు రాయ‌పాటి రంగారావుకు టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని అన్నారు. రంగబాబుకు సత్తెనపల్లి టికెట్ అడిగారు.

అక్కడ కోడెల శివప్రసాద్ ఉండటంతో చంద్రబాబు, రాయపాటి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వలేదు. దీంతో రాయపాటి మళ్ళీ నరసారావుపేట పార్లమెంట్ బరిలో పోటీ చేశారు. కానీ జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగారు. ఒకానొక సమయంలో ఈయన వైసీపీ లేదా బి‌జే‌పిలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ రాయపాటి పార్టీ మారలేదు. తాజాగా ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి, తాను రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లు ప్రకటించారు. అలాగే తన కుమారుడు, కుమార్తెలకు రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబుని అడిగినట్లు చెప్పారు.

ఇందులో సత్తెనపల్లి సీటు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు సత్తెనపల్లిలో కోడెల తనయుడు శివరాం ఉన్నారు. ఆయనకే ఆ సీటు ఇవ్వాలని టి‌డి‌పిలో కొంద‌రు కోరుతున్నారు. కానీ అక్కడ శివరాంకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో రాయపాటి తన ఫ్యామిలీకి సత్తెనపల్లి టికెట్ అడుగుతున్నారు. అలాగే నరసారావుపేట పార్లమెంట్ సీటు ఎలాగో, వారి ఫ్యామిలీకే వచ్చేలా ఉంది.

మరి సత్తెనపల్లి విషయంలోనే క్లారిటీ రావాలి. కోడెల ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటే బాబు, శివరాంకే సీటు ఇస్తారు. లేదు అక్కడ వ్యతిరేకత ఉంది పార్టీకే ఇబ్బంది అవుతుందనుకుంటే రూట్ మార్చి రాయపాటి వారసుడుని రంగంలోకి దింపవచ్చు. చూడాలి మరి సత్తెనపల్లి సీటు విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందో ? ఏదేమైనా రాయ‌పాటి రెండు సీట్ల డిమాండ్ ఇప్పుడు గుంటూరు టీడీపీ సీనియ‌ర్ల‌లో కాక రేపుతోంది..!