త‌మిళ బాహుబ‌లి పూర్త‌యింది

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు బాలీవుడ్ త‌ర్వాత సినిమా క్వాలిటీ ప‌రంగా త‌మిళ సినిమాదే పైచేయిగా ఉండేది. అక్క‌డ వినూత్న‌మైన, ప్ర‌యోగాత్మ‌క‌ క‌థ‌లు తెర‌కెక్కేవి. అలాగే భారీ చిత్రాల జోరూ ఉండేది. త‌మిళంతో పోలిస్తే తెలుగు సినిమాలు వెనుక‌బ‌డే ఉండేవి. కానీ గ‌త ఐదారేళ్ల‌లో ప‌రిస్థితులు వేగంగా మారిపోయాయి. తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. అదే స‌మ‌యంలో త‌మిళ చిత్రాలు వెనుక‌బ‌డిపోయాయి.

ముఖ్యంగా బాహుబ‌లి దెబ్బ‌కు కోలీవుడ్ కుదేలైపోయింద‌నే చెప్పాలి. ద‌క్షిణాదిన త‌మిళ చిత్రాల ఆధిప‌త్యానికి తెర‌దించింది ఆ చిత్ర‌మే. ఎప్పుడూ తెలుగులో త‌మిళ అనువాదాల జోరే చూసేవాళ్లం కానీ.. త‌మిళ బాక్సాఫీస్‌ను ఓ తెలుగు చిత్రం షేక్ చేయ‌డం బాహుబ‌లితోనే జ‌రిగింది. అది అక్క‌డి వాళ్ల‌కు అసూయ‌ను క‌లిగించింది. బాహుబ‌లికి దీటైన భారీ చిత్రం తీయాల‌ని అక్క‌డ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతూ వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టిదాకా ఏ సినిమా కూడా దాని ద‌రిదాపుల్లోకి రాలేదు.

ఐతే లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఎప్ప‌ట్నుంచో కంటున్న భారీ క‌ల‌.. పొన్నియ‌న్ సెల్వ‌న్ గ‌త ఏడాదే ప‌ట్టాలెక్క‌డంతో మ‌ళ్లీ త‌మిళుల్లో ఆశ‌లు రేకెత్తాయి. విక్ర‌మ్, ఐశ్వ‌ర్యారాయ్, కార్తి, త్రిష‌, జ‌యం ర‌వి, శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌కాష్ రాజ్.. ఇలా భారీ తారాగ‌ణంతో.. వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. త‌మిళంలో క‌ల్ట్ నావెల్‌గా పేరున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు మ‌ణిర‌త్నం. త‌మిళంలో ఇప్ప‌టిదాకా అత్య‌ధిక ఖ‌ర్చుతో తెర‌కెక్కిన సినిమా ఇది. బాహుబ‌లి త‌ర‌హాలోనే చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

మ‌ణిర‌త్నం ఇలాంటి నేప‌థ్యంలో సుదీర్ఘ స‌మ‌యం వెచ్చించి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ సినిమా తీయ‌డంతో అంచ‌నాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మొద‌లుపెట్టిన రెండేళ్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఈ సినిమా పూర్త‌యింది. క‌రోనా క‌ష్టాల‌ను అధిగ‌మించి షూటింగ్ పూర్తి చేశాడు మ‌ణిర‌త్నం. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం ఆరు నెల‌ల‌కు పైగా వెచ్చించ‌నున్నారు. 2022 వేస‌విలో పొన్నియ‌న్ సినిమా వివిధ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.