సైదాబాద్ ఘటన.. నిందితుడు ఆత్మహత్య!

సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బాలికను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు.. అతనిని పట్టుకుంటే రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు.

కాగా.. తాజాగా.. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన అందరినీ షాకింగ్ కి గురి చేసింది. నిందితుడు దొరికితే.. తమకు అప్పగించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు మధ్య తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ గురువారం ఉదయం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందిజేశారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని హామీఇచ్చారు.

మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులు హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్‌ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. ప్రభుత్వం అందజేసిన రూ.20 లక్షల సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులు అంటున్నారు.