ఇకపై రీమేక్స్ చేయను

బేసిగ్గా ఏ దర్శకుడూ రీమేక్ సినిమా చేయడానికి అంతగా ఇష్టపడడు. అందులోనూ కొంచెం కొత్తగా ఏదైనా చేయాలని చూసే దర్శకులు రీమేక్‌ల జోలికి వెళ్లరు. కెరీర్ అంత ఊపులో లేనపుడు, అవకాశాలు కొంచెం కష్టం అయినపుడు మాత్రమే రీమేక్ ఆఫర్లు వస్తే ఓకే చేస్తుంటారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఒక రీమేక్ మూవీని డైరెక్ట్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ మూడో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ డిజాస్టర్ కావడం.. ఆ తర్వాత గాంధీ అనుకున్న హీరోలెవరితోనూ సినిమా సెట్ కాకపోవడంతో అతను రీమేక్ బాట పట్టాడు.

బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘అంధాదున్’ను ‘మ్యాస్ట్రో’ పేరుతో నితిన్ హీరోగా రీమేక్ చేశాడు. ఈ ప్రపోజల్ పెట్టింది తనే అని.. ఐతే ఇకపై మాత్రం రీమేక్ సినిమాలు తీయనని అతను ఈ సినిమా ప్రమోషన్లలో స్పష్టం చేశాడు.

గత ఏడాది తాను అరకులో ఉండగా ఒక ఫ్రెండ్ చెప్పడంతో ‘అంధాదున్’ సినిమా చూశానని.. బాగా నచ్చి రీమేక్ అంటూ చేస్తే ఇలాంటి సినిమానే చేయాలి అనిపించి నితిన్‌ను సంప్రదించానని.. అతను ఓకే చెప్పడంతో తన సొంతబేనర్లోనే ఈ సినిమా చేశానని గాంధీ వెల్లడించాడు. ఐతే రీమేక్ సినిమాను ఉన్నదున్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారని, మార్పులు చేస్తే చెడగొట్టారని అంటారని.. తాను ‘అంధాదున్’ లైన్ తీసుకుని మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమా తీశానని గాంధీ అన్నాడు.

ఐతే ‘అంధాదున్’ను రీమేక్ చేయడం సంతోషమే అయినప్పటికీ.. ఇకముందు మాత్రం తాను రీమేక్ సినిమాలు తీయనని గాంధీ స్పష్టం చేశాడు. టబు చేసిన పాత్రకు తమన్నాను తీసుకోవాలన్న ఆలోచన తనదే అని.. ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ చూసి తనే షాకైపోయానని.. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుందని గాంధీ అన్నాడు. ఈ నెల 17న హాట్ స్టార్‌లో ‘మ్యాస్ట్రో’ స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే.