ఏపీ మంత్రుల్లో వీరి రూటు స‌ప‌రేటు!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రివ‌ర్గంలో ఉన్న కొంద‌రు చేస్తున్న వ్య‌వ‌హారం.. ప్ర‌బుత్వానికి త‌ల‌నొప్పి గా మారింది. వీరంతా సీనియ‌ర్లు కావ‌డం.. చేస్తున్న ప‌నులు విమ‌ర్శ‌ల‌కు దారితీయ‌డం.. తాజాగా మ‌రోసారి మంత్రుల‌పై చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌స్తుతం రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. క‌రోనా త‌ర్వాత‌.. ఆర్థిక ప‌రిస్థితి కూడా భారంగా మారింది. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డంలో ఆల‌స్యం వంటివి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ స‌మ‌యం లో చురుగ్గా ఉండి.. ప్ర‌భుత్వానికి మంచి స‌ల‌హాలు ఇస్తూ.. త‌మ త‌మ శాఖ‌ల ప‌నితీరును మెరుగు ప‌రుచుకోవాల్సిన మంత్రులు.. ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఎవ‌రి ఇష్టానుసారం వారు దూకుడు చూపించ‌డం.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంది.

మంత్రి బాలినేని: వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి బంధువు కూడా అయిన మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి.. కీల‌క శాఖ‌ను చూస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు పెరిగి(ట్రూ అప్ చార్జీలు) ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ స‌మయంలో ఆయ‌న ప్ర‌భుత్వ విధానాన్ని ఎందుకు చార్జీలు పెంచాల్సి వ‌చ్చిందో చెప్పి.. ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని స‌ర్దు బాటు చేయాల్సిన ఈయ‌న ర‌ష్యాటూర్‌లో ఉన్నారు. అది కూడా విలాస‌వంత‌మైన ప్ర‌త్యేక జెట్ విమానంలో ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం.. విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. సొంత ఖ‌ర్చుపైనే వెళ్లినా.. ప్ర‌స్తుత ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ఆయ‌న ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

మంత్రి పెద్దిరెడ్డి: రాష్ట్ర రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నాయ‌కుడైన పెద్ద‌రెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్య‌వ‌హారం కూడా ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది. గ్రానైట్ క్వారీలు, అక్ర‌మైనింగ్‌, ఎర్ర‌చంద‌నం వంటి విష‌యాలు ఆయ‌న చుట్టు తిరుగుతున్నాయి. వాటిని అదుపు చేయాల్సిన ఆయ‌న మౌనంగా ఉన్నార‌ని.. ఏ విష‌యాన్ని ప్ర‌స్తావించినా.. ప్ర‌తిప‌క్షాల కుట్ర అంటూ.. ఆయ‌న తేలిక‌గా తీసుకుంటున్నార‌ని.. ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పైగా మ‌రో నాలుగు నెల‌ల త‌ర్వాత‌.. త‌న ప‌ద‌వి ఉంటుందో ఊడుతుందో.. అనే బెంగ కూడా ఆయ‌న‌ను ఆవరించ‌డంతో అస‌లు ఆయ‌న త‌ట‌స్థంగా మారిపోయార‌ని.. అంటున్నారు. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్న దూకుడు ఇప్పుడు లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

మంత్రి వెలంప‌ల్లి: గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ వెస్ట్ నుంచి విజ‌యం ద‌క్కించుకుని.. తొలిసారి మంత్రి అయిన వెలంప‌ల్లి శ్రీనివాస్‌.. దేవ‌దాయ శాఖ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే.. ఈ శాఖ‌లో జ‌రిగిన‌న్ని వివాదాలు అన్నీ ఇన్నీ కావు. హిందూ ఆల‌యాల‌పై దాడులు.. ఆయ‌న మ‌నుషులు, సొంత సోద‌రుడు న‌ర‌సింహారావుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు మంత్రి చుట్టు తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి. పైగా ఉద్యోగుల మ‌ధ్య వివాదాలు కూడా న‌డుస్తున్నాయి. ఉన్న‌తాధికారిపై మ‌రో అధికారి ఇసుక పోసిన వివాదం ఇప్ప‌టికీ శాఖ‌లో విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తూనే ఉంది. ఉద్యోగుల‌పై ప‌ట్టు లేద‌నే అభిప్రాయం వెల్ల‌డ‌వుతోంది. పైగా సొంత పార్టీ ఎమ్మెల్యేల‌తోనే ఆయ‌న విభేదిస్తున్నార‌ని ప్ర‌చారంలో ఉంది. వెర‌సి.. ఆయ‌న కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌కుండా.. కేవ‌లం త‌న వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

మంత్రి గుమ్మ‌నూరు: క‌ర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం కూడా రాజ‌కీయాల‌కు కొత్త‌కాదు. అదే స‌మ‌యం వివాదాలే కేంద్రంగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. గ‌తంలో త‌న కుమారుడికి బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చార‌నే ఆరోప‌ణ‌లు వున్నాయి. ఇది అవినీతి క్ర‌మంలో అందిన ముడుపుగానే ప్ర‌చారంలో ఉంది. ప్ర‌స్తుతం ఇసుక అక్ర‌మ ర‌వాణాలో ఓ పోలీస్ అధికారిని ఆయ‌న బెదిరించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీని పై కేసు కూడా న‌మోదైంది.

మంత్రి కొడాలి: పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొంది పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని వ్య‌వ‌హారం గ‌తానికి భిన్నంగా యూట‌ర్న్ తీసుకుంది. బియ్యం అక్ర‌మ ర‌వాణాలో దాదాపు 4 వేల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు.. సొంత పపార్టీ నేత‌లే..(ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి) ఆరోప‌ణ‌లు చేశారు. అయినా.. ఎప్పుడూ.. త‌న‌పైనా.. ప్ర‌భుత్వంప‌పై ఎవ‌రు విమ‌ర్శ‌లు చేసినా.. వెంట‌నే స్పందించే ఈయ‌న ఇప్పుడు తేలుకుట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆర‌ప‌ణ‌లు ఉన్నాయి.

మంత్రి అవంతి: ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌.పైనా.. ఇటీవ‌ల కాలంలో అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విశాఖ‌లో భూముల క‌బ్జా ఆరోప‌ణ‌లు పెరిగాయి. దీనికితోడు .. ఇటీవ‌ల ఓ మ‌హిళ విష‌యంలో ఆయ‌న జ‌రిపిన‌ట్టుగా ప్ర‌చారంలో ఉన్న ఫోన్ సంభాష‌ణ మ‌రింత మ‌చ్చ‌గా మారింది. దీనిపైనా ఎవ‌రూ స్పందించ‌డం లేదు. ఇలా.. వీరంతా వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు.. ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. చ‌ర్య‌లు తీసుకుంటారా? లేక చూస్తూ ఊరుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.