సైకిల్ సెన్సేష‌న్.. ఇంటి ప‌క్క‌న టెంటు వేయాల్సొచ్చింది

జ్యోతికుమారి.. ఈ మ‌ధ్య కాలంలో మీడియాలో సెన్సేష‌న్‌గా మారిన పేరు. లాక్ డౌన్ టైంలో ప్ర‌జా ర‌వాణా లేక‌పోవ‌డంతో ఢిల్లీలోని గుర్గావ్ నుంచి బీహార్లోని సిరిహులి వ‌ర‌కు త‌న తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి తొక్కుకుంటూ వ‌చ్చిందీ టీనేజీ అమ్మాయి. ఏకంగా 1200 కిలోమీట‌ర్ల దూరం ఆమె సాహ‌స యాత్ర సాగింది.

దీనిపై మీడియాలో వార్త‌లు రావ‌డంతో జ్యోతి పేరు మార్మోగిపోయింది. ఆమె గురించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ట్వీట్ వేసింది. ఆమెకు సాయం చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకొచ్చాయి. భార‌త సైక్లింగ్ స‌మాఖ్య ఆమెకు శిక్ష‌ణ ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది. ఈ ఉదంతంతో జ్యోతి నేష‌న‌ల్ సెల‌బ్రెటీ అయిపోయింది.

ఆమెను చూడ‌టానికి రోజూ 40-50 మంది త‌న ఇంటికి వెళ్తున్నార‌ట‌. త‌మ‌ది చిన్న ఇల్లు కావ‌డం, క‌రోనా భ‌యం కూడా ఉండ‌టంతో జ్యోతి ఇంటి ప‌క్క‌నే ఒక టెంట్ వేసి వ‌చ్చిన అతిథుల్ని అందులోకి ఆహ్వానించి జ్యోతి వారితో ముచ్చ‌టిస్తోంద‌ట‌. తాను అమ్మాయిని కాబ‌ట్టే తాను చేసిన సాహ‌సానికి అంత గుర్తింపు వ‌చ్చింద‌ని జ్యోతి అంటోంది. తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన తండ్రిని అంత దూరం తీసుకొచ్చానని.. లాక్ డౌన్ వ‌ల్ల ఎంతోమంది పరిస్థితి ఇలాగే ఉందని జ్యోతి చెప్పింది.

జ్యోతి కోసం ఉద‌యం ఏడు నుంచే త‌న ఇంటికి జ‌నాలు వ‌స్తున్నారు. రాత్రి ఎనిమిది వ‌ర‌కు ఇలా అతిథుల‌తోనే ఆమె ఇల్లు నిండిపోతోంది. దీనిపై జ్యోతి తండ్రి మాట్లాడుతూ.. “మా ఇల్లు చాలా చిన్న‌ది. అందుకే ప‌క్క‌నే చిన్న టెంట్ వేశాం. వ‌చ్చిపోయే వాళ్ల వ‌ల్ల క‌రోనా సోకుతుంద‌న్న భ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రినైనా రావొద్ద‌ని అంటే మాకు గ‌ర్వం వ‌చ్చింద‌ని అనుకుంటారు. అందుకే ప‌క్క‌నే ఓ టెంట్ వేశాం. అంద‌రూ అక్క‌డికి వ‌చ్చి మా అమ్మాయిని ఆశీర్వ‌దించొచ్చు’’ అని జ్యోతి తండ్రి మోహ‌న్ పాస‌వాన్ అన్నాడు.