పవన్ మనసు కరిగిందంటే అంతే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దయా గుణం గురించి చెప్పడానికి చాలా ఉంది. నటుడిగా తొలి అడుగులు వేస్తున్న సమయం నుంచి అతడి సేవా భావం గురించి అందరికీ తెలిసిందే. కార్గిల్ యుద్ధ సమయంలో వీర సైనికుల కోసం విరాళం ఇవ్వడం దగ్గర్నుంచి.. గత రెండు దశాబ్దాల్లో పవన్ తన సేవా భావాన్ని చాటుకున్న ఉదంతాలు ఎన్నో. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఎన్నోసార్లు వివిధ సేవా కార్యక్రమాల కోసం విరాళాలు అందజేసిన పవన్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక మరింతగా తన ఉదారతను చాటుకున్నాడు.

ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశారు. ఇప్పుడు ఓ పేద కళాకారుడిని ఆదుకోవడానికి పవన్ ముందుకొచ్చాడు. ఆ కళాకారుడే.. దర్శనం మొగిలయ్య. తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్‌ కోసం తన గొంతును అరువిచ్చిన మొగిలయ్యకు పవన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది.

జానపద కళాకారుడైన మొగిలయ్య గురించి మొన్నటిదాకా జనాలకు పెద్దగా తెలియదు. అంతర్ధానం అయిపోతున్న 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ ప్రాచీన కళను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అరుదైన కళాకారుడు మొగిలయ్య. కొన్ని నెలల ముందు వరకు బస్టాండ్లలో పాటలు పాడుతూ డబ్బులు యాచించడం ద్వారా అతి కష్టం మీద జీవనం సాగిస్తూ వచ్చాడు మొగిలయ్య. ఆయన గురించి ఓ పత్రికలో వార్త రావడంతో ప్రభుత్వం స్పందించి కొంత సాయం అందించింది.

జానపదాల మీద పవన్ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తాడన్న సంగతి తెలిసిందే. ఆయన గత సినిమాలు చాలా వాటిలో జానపదాలు చూడొచ్చు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌ను కూడా ఫోక్ స్టయిల్లో చేశారు. ఈ పాటలో ఆరంభ గానం మొగిలయ్యతోనే చేయించారు. ఈ సందర్భంగా మొగిలయ్య గురించి తెలుసుకుని పవన్.. తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ ద్వారా ఆయనకు రూ.2 లక్షల సాయాన్ని అందజేశారు.