ఆఫ్ఘన్లో పెరిగిపోతున్న ఆకలి కేకలు

ఆప్ఘన్లో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. లక్షలాది మంది జనాలు కడుపునిండా తిండితిని రోజులైపోయాయట. ఐక్యారాజ్య సమితి అంచనా ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో సుమారు 30 శాతంకి ఒకపూట భోజనం దొరకటం కూడా చాలా కష్టమైపోతోందట. వీరిల్లో ముసలివాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒకవైపు తాలిబన్ల అరాచకం, మరోవైపు ఆకలి బాధలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఆగష్టు 15వ తేదీన దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న రెండు రోజులకు సమస్యలు మొదలైనట్లు అంచనా.

అంతర్జాతీయ తీవ్రవాద సంస్ధల జాబితాలో తాలిబన్లు కూడా ఉండటంతో ప్రపంచదేశాలు ఆప్ఘన్తో వ్యాపార లావాదేవీలు నిర్వహించటానికి ఇష్టపడటంలేదు. దీనికి అదనంగా తాలిబన్లు కూడా దేశాల సరిహద్దులను మూసేయటం, అంతర్జాతీయంగా విమానర్వీసులను నిలిపేయటంతో ప్రపంచదేశాలకు-ఆప్ఘన్ కు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిబన్లు చేస్తున్న అరాచకాలను చూసిన తర్వాత ఏ దేశం కూడా వీళ్ళతో సంబంధాలు పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. దీని ప్రభావం దేశంలోని జనాల రోజువారి జీవితం మీద పడింది.

మామూలుగానే ఆప్ఘన్ నుండి ఎగుమతులు చాలా తక్కువే. దేశంలో నుండి ఎగుమతవుతున్న వస్తువుల్లో చెప్పుకోవాల్సింది ఏమిటంటే మత్తుమందు ఓపియం. ప్రపంచ మత్తుమందుల వాడకంలో ఓపియం ఎగుమతుల్లో ఆప్ఘనే 95 శాతం ఎగుమతి చేస్తోంది. ఇది కాకుండా డ్రైఫూట్స్ ఎగుమతవుతుంటాయి. ఇక మామూలు ఆహార ధాన్యాలు, ఉప్పులు, నూనెలు సమస్తం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. తాలిబన్ల అరాచకాల కారణంగా దిగుమతులు, ఎగుమతులు కూడా నిలిచిపోయాయి.

ప్రస్తుతం దేశంలో ఏ నగరానికి వెళ్ళినా బ్రెడ్డు ఖరీదు సుమారు రు. 7500. కిలో బంగాళదుంపల ఖరీదు 8 వేల రూపాయలట. అంటే తాలిబన్ల కదలికలను గమనించిన వ్యాపారస్తులు ముందుజాగ్రత్తగా తమ దగ్గరున్న నిత్యావసరాలను, బ్రెడ్డు లాంటి బేకరీ ఐటములను జనాలకు అమ్మటం మానేశారు. వాళ్ళు ఊహించినట్లే తాలిబన్ల అరాచకాలు పెరిపోవటంతో నిత్యావసరాలు, బేకరీ ఐటములు మార్కెట్లో దొరకటంలేదు. దీంతో ధరలు ఆకాశానికి ఎగబాకటంతో ధనవంతులు కూడా కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి.