ఆకాశ రామ‌న్న విరాళాలు.. అక్ష‌రాల రూ.14 వేల కోట్లు

ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. నాయ‌కులు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌డం ద‌గ్గ‌ర నుంచి గెలిచి పార్టీని అధికారంలోకి తెచ్చేంత వ‌ర‌కూ చాలా డ‌బ్బు ఖ‌ర్చువుతోంది. అస‌లు ఎంత ధ‌నం వెచ్చిస్తున్నారో కూడా అంచ‌నాల‌కు అంద‌ట్లేదు. ప్ర‌చారాల కోస‌మ‌ని ఓట‌ర్ల‌ను కొన‌డం కోస‌మ‌ని ఇలా ఎన్నిక‌లు వ‌స్తే చాలు డ‌బ్బు ప్ర‌వాహం కొన‌సాగుతుంది. మ‌రి ఇంత మొత్తంలో ఖ‌ర్చు పెట్టేందుకు పార్టీల‌కు ఇన్ని కోట్ల రూపాయాల ధ‌నం ఎక్క‌డ‌నుంచి వ‌స్తుంద‌నే అనుమానం రావ‌డం స‌హ‌జ‌మే. పార్టీ స‌భ్య‌త్వ రుసుము కింద వ‌చ్చేది కొంత‌మైతే ప్ర‌ధానంగా విరాళాల రూపంలోనే పార్టీల‌కు అధిక మొత్తంలో డ‌బ్బు వ‌చ్చి చేరుతుంది. బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు పార్టీల‌కు కావాల్సిన వాళ్లు ప్ర‌భుత్వంతో ప‌ని చేయించుకోవాల్సిన వాళ్లు ఇలా ఎంతో మంది త‌మ అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికే పార్టీల‌కు విరాళాలు ఇస్తార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.

పార్టీల‌కు విరాళాలు ఇచ్చిన వాళ్ల పేర్ల‌ను కొన్న సంద‌ర్భాల్లో బ‌య‌ట‌కు ప్ర‌క‌టిస్తే మ‌రికొన్ని స‌మ‌యాల్లో గుట్టుగానే ఉంచుతారు. మ‌రోవైపు ఎవ‌రో కూడా తెలీని వాళ్ల నుంచి విరాళాలు అందాయ‌ని పార్టీలు చెప్తాయి. ఇలా అన్‌నోన్ సోర్సెస్ (అభిజ్ణ వ‌ర్గాల‌) నుంచి అందిన విరాళాలు ఎవ‌రిచ్చారో తెలీదు. కానీ ఈ రూపంలో పార్టీల‌కు వంద‌ల కోట్లు అందుతుంటాయి. తాజాగా ఈ స‌మాచారాన్నే అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫామ్స్ (ఏడీఆర్‌) సంస్థ వెల్ల‌డించింది.

గ‌త 15 ఏళ్ల‌లో దేశంలోని జాతీయ పార్టీల‌కు అన్‌నోస్ సోర్సెస్ ద్వారా రూ.14,651.53 కోట్ల విరాళాలు అందిన‌ట్లు వెల్ల‌డించింది. 2004-05 నుంచి 2019-20 మ‌ధ్య‌కాలంలో ఈ మొత్తం విరాళాలు స‌మ‌కూరిన‌ట్లు తెలిపింది. ఒక్క 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఈ పార్టీల‌కు రూ.3,371.41 కోట్ల మేర ఇలాంటి విరాళాలు అంద‌గా.. అందులో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఖాతాలోకి ఏకంగా రూ.2,642.63 కోట్లు చేరినట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. కాంగ్రెస్‌తో (రూ.526 కోట్లు) సహా మిగిలిన ఆరు జాతీయ పార్టీల‌కు క‌లిపి రూ.734.78 కోట్లు వ‌చ్చాయి.

రూ.20 వేల‌కు పైగా ఎవ‌రు విరాళాలు ఇచ్చినా వాళ్ల వివ‌రాల‌ను ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించే నివేదిక‌లో రాజ‌కీయ పార్టీలు స‌మ‌ర్పంచాల్సి ఉంటుంది. కానీ వ్య‌క్తిగ‌త విరాళాల‌ను రూ.20 వేల లోపే చూపుతూ వాళ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌క‌పోతే వాటిని అన్‌నోన్ సోర్సెస్ నుంచి వ‌చ్చిన విరాళాలుగా భావించాల్సి ఉంటుంద‌ని ఏడీఆర్ పేర్కొంది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌, తృణ‌మూల్, సీపీఎం, ఎన్‌సీపీ, సీపీఐ, బీఎస్పీల‌ను ప్ర‌స్తుతం జాతీయ పార్టీలుగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ పార్టీల‌న్నింటికీ క‌ల‌పి 2019-20కి గాను రూ.4,758.20 కోట్ల ఆదాయం వ‌చ్చింది. అందులో రూ.1,013.80 కోట్లు మాత్ర‌మే ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో పార్టీలు తెలిపాయి. మొత్తం విరాళాల్లో ఇది కేవ‌లం 21.31 శాతం మాత్ర‌మే. మిగిలిన రూ.3,377.41 కోట్ల‌కు వివ‌రాలేమీ లేవు. అందులో రూ.2,9993.82 కోట్లు ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపంలో వ‌చ్చాయి. మ‌రోవైపు గ‌త 15 ఏళ్ల‌లో కూప‌న్ల విక్ర‌యం ద్వారా కాంగ్రెస్‌, ఎన్సీపీల‌కు రూ.4,096 కోట్ల విరాళాలు ద‌క్కాయి.