రేవంత్ రెడ్డి కి చెక్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!

తెలంగాణలో కేసీఆర్ కి పంటికింద రాయిలాగా.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తగులుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా… కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. రేవంత్ ని ఓడించేందుకు భారీ కసరత్తే జరిగింది. రేవంత్ కి కంచుకోటలా ఉండే కొడంగల్ లోనే.. ఆయనను స్వల్ప మెజార్టీతో ఓడించారు. రేవంత్ ని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాల్లో సఫలమయ్యారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలా ఓడించడం అంత సులువు కాదని తెలుస్తోంది. అందుకే.. ఇప్పటి నుంచే ఆ కొడంగల్ నియోజకవర్గాన్ని.. టీఆర్ఎస్ తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని ఇప్పటి నుంచే భారీ స్కెచ్చులు వేస్తోంది. ఈక్రమంలో కొడంగల్ పై కేసీఆర్ తన స్టైల్లో వల వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

దళిత బంధులాగే.. అన్ని వర్గాలకు అలాంటి పథకమే తీసుకొస్తానని చెప్తున్నారు కేసీఆర్. ఈక్రమంలో కొడంగల్లో గిరిజన బంధు ఆస్త్రాన్ని ప్రయోగించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ 10 శాతానికి పైగా ఓట్లు ఆ సామాజికవర్గానికి చెందినవే ఉండటంతో గిరిజన బంధు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ను ఎంచుకోవాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తుండటంతో.. ఆయనకు అదే దారిలో కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ ఇటీవల కొడంగల్లో నిర్వహించిన సర్వేల్లో అన్ని వర్గాల్లోనూ టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనిపించిందని తెలుస్తోంది. అందుకే.. రేవంత్ కి వ్యతిరేకంగా అక్కడి ప్రజలను ఆకర్షించేలా.. ఈ గిరిజన పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.