వైఎస్ సన్నిహితులతో విజయమ్మ భేటీ ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితులకు ఆయన భార్య విజయమ్మ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లో విజయమ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కు సన్నిహితులుగా ఉన్నవారిని, మంత్రివర్గంలో కలిసి పనిచేసిన వారిని, గట్టి మద్దతుదారులుగా ఉన్నవారికి విజయమ్మ ఇప్పటికే ఫోన్లుచేసి ఆహ్వానించినట్లు సమాచారం.

ఆ ప్రత్యేక కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనే విషయంలో క్లారిటీలేదు. అయితే కార్యక్రమానికి హాజరుకావాలంటు ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, డీ. శ్రీనివాసరావు లాంటివారిని విజయమ్మ ఆహ్వానించారట. ప్రత్యేక కార్యక్రమం నిర్వహణకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా ఎవరు నమ్మటంలేదు. వైఎస్సార్ వర్దంతి రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకోవటంలో తప్పులేదు.

అయితే ఆ కార్యక్రమం ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు మీద జరిగితే ఎవరికీ అనుమానం రాదు. కానీ ఆ ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ లో జరగబోతోంది. జగన్ ఏపి సీఎంగా ఉండగా కార్యక్రమం మాత్రం హైదరాబాద్ లో జరగబోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అందులోను ఆహ్వానాలన్నీ విజయమ్మ పేరుమీద వెళుతుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదే సంద్భంలో వైఎసార్ కూతురు షర్మిల తెలంగాణా రాజకీయాలో అడుగుపెట్టింది.

వైఎస్సార్టీపికి విజయమ్మ, షర్మిల అనుకున్నంత హైప్ రావటంలేదు. షర్మిల పార్టీ లాంచింగ్ రోజున విజయమ్మ కూడా పాల్గొన్నారు. పార్టీ ప్రారంభంరోజున కన్నా ఇపుడు పార్టీ పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. ఇలాంటి పరిణామాలను గమనిస్తున్నవారికి విజయమ్మ నుండి ఫోన్లు, ఆహ్వనాలు అందుతుండటం ఆశ్చర్యంగానే ఉంది. వైఎస్ చనిపోయిన ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు ఇలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిందిలేదు.

పైగా వైఎస్ కు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా పులివెందలలోని ఇడుపులపాయలోనే జరపటం ఆనవాయితీగా ఉంది. అలాంటిది సెప్టెంబర్ 2న జరగబోయే వర్దంతి రోజున హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారనేటప్పటికి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తెరవెనుక ఏదో బలమైన పరిణామాలే జరుగుతున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ ప్రత్యేక కార్యక్రమానికి విజయమ్మ కొడుకు జగన్, కూతురు షర్మిలను కూడా ఆహ్వానిస్తారా ? అనేదే ఇపుడు సస్పెన్సుగా మారింది. చూద్దాం ఆరోజు ఏమి జరుగుతుందో.